LOADING...
Andhra News: దుగరాజపట్నంలో నౌకానిర్మాణ క్లస్టర్‌.. 1.48 లక్షల ఉపాధి అవకాశాలు
Andhra News: దుగరాజపట్నంలో నౌకానిర్మాణ క్లస్టర్‌.. 1.48లక్షల ఉపాధి అవకాశాలు

Andhra News: దుగరాజపట్నంలో నౌకానిర్మాణ క్లస్టర్‌.. 1.48 లక్షల ఉపాధి అవకాశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి జిల్లా దుగరాజపట్నం వద్ద కేంద్ర ప్రభుత్వం ఒక నౌకానిర్మాణ క్లస్టర్‌ ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఎస్‌పీవీ స్థాపన కోసం అవసరమైన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని ఆయన తెలిపారు. నౌకల నిర్మాణం, మరమ్మతుల కోసం అవసరమయ్యే షిప్‌యార్డులు స్థాపించడానికి అనువైన భూభాగాలను ఇప్పటికే గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఈ క్లస్టర్‌ ప్రారంభమైతే సుమారు 1.48 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ఒక నౌకానిర్మాణ యార్డు ఏర్పాటు

గురువారం జరిగిన శాసనసభ సమావేశంలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు ఈశ్వరరావు, కొణతాల రామకృష్ణ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ఒక నౌకానిర్మాణ యార్డు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన చెప్పారు. ఈ మేరకు యువతకు ఎక్కువ ఉపాధి కల్పించగల యూనిట్ల కోసం మారిటైం బోర్డు ద్వారా పరిశీలనలు ప్రారంభించామని తెలిపారు. అలాగే, వివిధ నిర్మాణాలకు సంబంధించి మూడు నుండి నాలుగు ఏజెన్సీలు ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించాయని ఆయన చెప్పారు.

వివరాలు 

త్వరలోనే టెండర్ ప్రక్రియ

బుడగట్లపాలెంలో రూ.186 కోట్ల వ్యయంతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేశామని, త్వరలోనే టెండర్ ప్రక్రియ చేపడతామని వివరించారు. ఫేజ్‌-1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు పూర్తికి చేరువలో ఉన్నాయని, త్వరలో వాటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే విధంగా, ఫేజ్‌-2లో మరో ఆరు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు.