Earthquake In Ongole: ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ముఖ్యంగా దేవుడు చెరువు, నెల్లూరు బస్టాండ్, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ప్రజలు తెలిపారు. రాత్రి సమయంలో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనాలు ఉలిక్కిపడ్డారు. కొన్ని ఇళ్లలో ఫ్యాన్లు, కిటికీలు స్వల్పంగా కంపించడంతో భయపడిన ప్రజలు వెంటనే ఇళ్ల బయటకు పరుగులు తీశారు.
వివరాలు
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. భూ ప్రకంపనల విషయాన్ని స్థానికులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రకంపనల తీవ్రత ఎంత మేర నమోదైందన్న అంశంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఒంగోలు నగర ప్రజల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. కాగా, గతంలో కూడా ప్రకాశం జిల్లాలో పలు మార్లు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే.