తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రభుత్వ పాఠశాలలో దారణం జరిగింది. తరగతి గదిలో ఉపాధ్యాయుల సమక్షంలో తొమ్మిదో తరగతి చదవుతున్న ఒక విద్యార్థి మరో విద్యార్థిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. పరీక్ష జరుగుతుండగా ఎగ్జామ్ హాలులోనే ఉపాధ్యాయుల ఎదుటే విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ఈ హింసకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థి హరీష్
ఈ దారుణానికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజానగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పెంకే శ్రీహరి సాయి, ఉదయ్ శంకర్ అనే ఇద్దరు బాలురు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పరీక్ష హాలులో పరీక్ష రాస్తున్న శ్రీహరి సాయిపై ఉదయ్ శంకర్ అనే విద్యార్థి కత్తితో దాడి చేశాడు. అనంతరం ఉదయ్ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది బాధిత విద్యార్థిని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హరీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.