ECI: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. ఇద్దరు కీలక అధికారుల బదిలీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో దుష్యంత్ నరియాలను నియమించింది. అదే సమయంలో హోం శాఖ కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనాపైనా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయనను కూడా ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించిన ఈసీ, ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి సంఘమిత్ర ఘోష్ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నందిని చక్రవర్తి, జగదీశ్ ప్రసాద్ మీనాలకు ఎలాంటి పోలింగ్ సంబంధిత బాధ్యతలు అప్పగించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
వివరాలు
రెండు విడతలుగా పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంతవరకు ఎన్నికలకు సంబంధించిన ఏ విధులలోనూ ఈ ఇద్దరు అధికారులు పాల్గొనరాదని తమ లేఖలో పేర్కొంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. తాము జారీ చేసిన ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని కూడా స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితా, సవరణలు వంటి అంశాలపై తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య గత కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.