Telangana: పాఠ్యపుస్తకాల సరఫరాపై విద్యాశాఖ యూటర్న్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సమయానికి చేరాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మొదటిగా మండల కేంద్రాల వరకు సరఫరా చేయాలని పాఠశాల విద్యాశాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ నిర్ణయంపై తాజాగా వెనక్కి తగ్గింది. గతంలో అమలులో ఉన్న విధానాన్నే కొనసాగిస్తూ, ప్రింటర్లు జిల్లా కేంద్రాల వరకే పుస్తకాలు సరఫరా చేయడానికి అంగీకరించారు. టెండర్ ఆలస్యంగా రావడంతో మండల కేంద్రాల వరకు పంపిణీ చేయడం సాధ్యం కాదని, అలా చేస్తే సకాలంలో పుస్తకాలు అందజేయలేమని ముద్రణదారులు స్పష్టం చేయడంతో, జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలను తరలించే బాధ్యతను విద్యాశాఖే స్వయంగా తీసుకుంది.
వివరాలు
మండల కేంద్రాలకు ఆలస్యంగా చేరుతున్న పుస్తకాలు
రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 10 తరగతుల వరకు చదువుతున్న సుమారు 24 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతి ఏడాది ప్రభుత్వం ప్రైవేట్ ప్రింటర్ల ద్వారా పాఠ్యపుస్తకాలు ముద్రింపజేస్తోంది. ముద్రించిన పుస్తకాలు సాధారణంగా జిల్లా కేంద్రాల్లోని గోదాములకు సమయానికి చేరుతున్నప్పటికీ, అక్కడి నుంచి మండలాలకు, తదుపరి పాఠశాలలకు పంపిణీ చేయడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. ఈ బాధ్యతను డీఈఓలకు అప్పగించినా, అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో వారు కొన్నేళ్లుగా ఉన్నతాధికారులకు విన్నవించుకుంటూనే ఉన్నారు. అయినా స్పందన లేకపోవడంతో పుస్తకాలు మండల కేంద్రాలకు ఆలస్యంగా చేరుతున్న పరిస్థితి కొనసాగుతోంది. ఇదే కారణంగా ఈసారి ముద్రించిన పుస్తకాలను నేరుగా మండలాల వరకూ చేర్చాలనే ఉద్దేశంతో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు.
వివరాలు
నోటిఫికేషన్ ఆలస్యంతో పంపిణీ సాధ్యం కాదన్నా ప్రింటర్లు
అయితే నోటిఫికేషన్ ఆలస్యంగా జారీ కావడంతో పంపిణీ సాధ్యం కాదని ప్రింటర్లు అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన పాఠ్యపుస్తకాల విభాగం సంచాలకుడు, నోటిఫికేషన్ ఆలస్యమైనందున జిల్లా కేంద్రాల వరకే సరఫరాకు అంగీకరించామని, అక్కడి నుంచి మండలాలకు విద్యాశాఖే పంపిణీ చేస్తుందని చెప్పారు. ఇకపై డీఈఓలకు ఈ బాధ్యత ఉండదని, ఏప్రిల్ 30 నాటికి అన్ని జిల్లాలకు పుస్తకాలు చేరేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
వివరాలు
పెండింగ్ బకాయిలన్నింటినీ త్వరలోనే చెల్లిస్తాం
ఇదిలా ఉండగా, గత ఏడాది ముద్రించిన పాఠ్యపుస్తకాలకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించలేదని ప్రింటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది తో పాటు అంతకుముందు సంవత్సరాల బకాయిలు కలిపి సుమారు రూ.40 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని పలుమార్లు అధికారులను కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన సంచాలకుడు, పెండింగ్ బకాయిలన్నింటినీ త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.