Loading...
Telangana: ఎల్‌నినో ప్రభావం.. తెలంగాణలో 1.72 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల కోత
ఎల్‌నినో ప్రభావం.. తెలంగాణలో 1.72 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల కోత

Telangana: ఎల్‌నినో ప్రభావం.. తెలంగాణలో 1.72 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల కోత

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2026
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు తెలంగాణలో ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపైనా తీవ్ర ప్రభావం చూపాయి. రాష్ట్రంలో గత ఏడాది ఇదే సమయానికి 11,24,001 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయగా,ఈ ఏడాది అది 9,51,134 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని ఉద్యాన శాఖ మంగళవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. దీంతో మొత్తం 1,72,867 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు తగ్గినట్లు స్పష్టమైంది. కూరగాయలు, పసుపు, మిర్చి తదితర పంటల సాగు గణనీయంగా తగ్గిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరగడం వల్ల 2023 నుంచి 2025 వరకు ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుతూ వచ్చింది.

వివరాలు 

9,51,134 ఎకరాల్లోనే ఉద్యాన పంటలు

సాధారణంగా తెలంగాణలో ఏప్రిల్ నుంచి జులై వరకు ఉద్యాన పంటల ప్రధాన సాగు సీజన్‌గా ఉంటుంది.

2023లో 12,03,380 ఎకరాలు, 2024లో 11,39,832 ఎకరాలు, 2025లో 11,24,001 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి.

ఈసారి వర్షాభావం కారణంగా వరి సాగు తగ్గుతుందని, దాని ప్రభావంతో ఉద్యాన పంటల విస్తీర్ణం పెరుగుతుందని రైతులు, అధికారులు భావించారు.

అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం కేవలం 9,51,134 ఎకరాల్లోనే ఉద్యాన పంటలు సాగవుతున్నాయి.

రానున్న రోజుల్లో మంచి వర్షాలు కురిస్తే ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

పంటల వారీగా సాగు పరిస్థితి

గత ఏడాది ఇదే సమయానికి టమాటా, బెండ, బీరతో పాటు ఇతర కూరగాయలు,ఆకుకూరలు కలిపి 53,405 ఎకరాల్లో సాగు చేయగా,ఈసారి అవి 19,259 ఎకరాలకు పరిమితమయ్యాయి.

దీంతో కూరగాయల సాగు 34,146 ఎకరాలు తగ్గింది. పసుపు, మిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, ఇతర మసాలా దినుసుల సాగు కూడా భారీగా క్షీణించింది.

గత ఏడాది 1,81,735 ఎకరాల్లో సాగు చేసిన ఈ పంటలు ప్రస్తుతం 41,395 ఎకరాల్లో మాత్రమే ఉన్నాయి. అంటే ఈ విభాగంలోనే 1,40,340 ఎకరాల సాగు తగ్గింది.

మామిడి, నిమ్మ, దానిమ్మ, జామ వంటి పండ్ల తోటల విస్తీర్ణంలో మాత్రం స్వల్ప తగ్గుదల నమోదైంది. గత ఏడాది 4,52,921 ఎకరాల్లో ఉన్న ఈ తోటలు ప్రస్తుతం 4,52,104 ఎకరాల్లో కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

పంటల వారీగా సాగు పరిస్థితి

ఇక ఆయిల్‌పాం సాగు మాత్రం పెరుగుదల నమోదు చేసింది. గత ఏడాది 3,10,776 ఎకరాల్లో సాగు చేసిన ఆయిల్‌పాం, ఇతర సంబంధిత పంటలు ఈసారి 3,20,111 ఎకరాలకు చేరాయి.

దీంతో కొత్తగా 9,335 ఎకరాల్లో ఈ పంటల సాగు పెరిగింది. అయితే పూల పంటలు, ఔషధ మొక్కల సాగు కూడా ఈసారి గణనీయంగా తగ్గినట్లు ఉద్యాన శాఖ నివేదికలో పేర్కొంది.

రాష్ట్రంలో వర్షపాతం పరిస్థితులు మెరుగుపడితే రానున్న రోజుల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT