El Nino: నైరుతి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ.. 85 శాతానికే పరిమితం కానున్న వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం కనిపించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో 2026 వర్షాకాలంపై ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఆందోళనకర అంచనాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ సీజన్లో దీర్ఘకాల సగటు (ఎల్పీఏ)తో పోలిస్తే కేవలం 85 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో దేశంలో కరువు ముప్పు 70 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. ఏప్రిల్లో స్కైమెట్ 94 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా.. తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆ అంచనాను భారీగా తగ్గించింది.
వివరాలు
బలపడుతున్న ఎల్ నినోనే వర్షాల లోటుకు ప్రధాన కారణం
బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులే వర్షపాత అంచనాలను సవరించడానికి ప్రధాన కారణమని స్కైమెట్ వెల్లడించింది.
ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు మరింత తీవ్రతరం అయితే సెప్టెంబర్ నాటికి ఎల్ నినో 'సూపర్ ఎల్ నినో' స్థాయికి చేరుకునే అవకాశం ఉందని స్కైమెట్ మేనేజింగ్ డైరెక్టర్ జతిన్ సింగ్ తెలిపారు.
ఆగస్టులో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతంలో 84 శాతం, సెప్టెంబరులో 80 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు.
మరోవైపు ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) సానుకూల దశలోకి మారుతున్నప్పటికీ.. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదని స్కైమెట్ పేర్కొంది.
వివరాలు
ఉత్తరాంధ్ర, రాయలసీమలోనూ గణనీయంగా వర్షపాతం లోటు
ఇప్పటికే వర్షపాత లోటు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
జూన్ 1 నుంచి ఆగస్టు మధ్య వరకు నమోదైన వర్షాలను పరిశీలిస్తే.. దేశంలో సగటు కంటే 13 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రాంతంలో వర్షపాతం లోటు 21 శాతంగా నమోదైంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండగా.. అక్కడ వర్షపాతం లోటు ఏకంగా 27 శాతానికి చేరింది.
వివరాలు
సాధారణం కంటే తక్కువ వర్షాలేనన్న భారత వాతావరణ శాఖ
మరోవైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా నైరుతి రుతుపవనాల రెండో అర్ధభాగంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
మొత్తం రుతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ గతంలో వెల్లడించింది.
అయితే ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు బలపడుతుండటంతో వర్షపాతంపై మరింత ఆందోళన నెలకొంది.
వర్షాలు తగ్గితే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.