Page Loader
Telangana: తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం
తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం

Telangana: తెలంగాణ ఆలయాల్లో బంగారం నిల్వలు.. టాప్‌లో వేములవాడ రాజన్న ఆలయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 06, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఎంత బంగారం, వెండి ఉందో ఇటీవల దేవాదాయశాఖ అధికారులు వివరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ ఆలయాలతో పాటు, అన్ని ఆలయాల్లోని బంగారం, వెండి నిల్వలు కూడా వెల్లడించారు. వేములవాడ రాజన్న ఆలయంలో 97 కిలోల బంగారం ఉందని, ఆ తర్వాత భద్రాచలంలో రామయ్యకు 67 కిలోల బంగారం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామికి 61 కిలోల బంగారం ఉందని పేర్కొన్నారు. మొత్తం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో 1,048 కేజీల బంగారం ఉంది.

వివరాలు 

ఆర్జేసీ కేటగిరిలో  వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్ట

తెలంగాణలో మొత్తం 704 ఆలయాలు ఉన్నాయి. వాటి ఆదాయం ఆధారంగా, ఆయా ఆలయాలను రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ), జిల్లా కమిషనర్ (డీసీ), అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ)లు నిర్వహిస్తారు. ఆర్జేసీ కేటగిరిలో ఉన్న ఆలయాలు వేములవాడ, భద్రాచలం, యాదగిరిగుట్టలో ఉన్నాయి. డీసీ కేటగిరిలో కొండగట్టు ఆంజనేయస్వామి, కొమరవెల్లి మల్లికార్జునస్వామి, బాసర సరస్వతీ ఆలయం, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్స్ ఉన్నాయి. ఏసీ కేటగిరిలో మరో 13 ఆలయాలు ఉన్నాయి. మిగిలిన ఆలయాలు 6(ఏ), (బీ), (సీ), (డీ) కేటగిరీల్లో ఉన్నాయి. వెండి నిల్వల విషయానికి వస్తే, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో మొత్తం 38,783 కిలోల వెండి ఉన్నట్లు వెల్లడించారు.

వివరాలు 

త్రిసభ్య కమిటీ ఆమోదం తర్వాత మాత్రమే బంగారం కరిగించే అవకాశం

రాజన్న ఆలయంలో 4,930 కిలోల వెండి, యాదగిరిగుట్టలో 2,312 కిలోల వెండి, భద్రాచలంలో 980 కిలోల వెండి ఉంది. డీసీ కేటగిరీలోని 4 ఆలయాల్లో 3,331 కిలోల వెండి, ఏసీ కేటగిరిలోని 13 ఆలయాల్లో 4,415 కిలోల వెండి ఉంది. 6(ఏ), (బీ), (సీ), (డీ) కేటగిరీల్లో 22,811 కిలోల వెండి ఉంది. భక్తులు అందించే బంగారం కేవలం ప్రభుత్వ అనుమతి మేరకే కరిగించబడుతుంది. ఆలయాల అవసరానికి అనుగుణంగా, త్రిసభ్య కమిటీ ఆమోదం తర్వాత మాత్రమే బంగారం కరిగించే అవకాశం ఉంటుంది. ఏ ఆలయానికి సంబంధించిన బంగారం ఆ ఆలయం పరిధిలోనే ఉంటుంది, అని అధికారులు స్పష్టం చేశారు.