Telangana:12 ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులకు అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించిన దస్త్రం కొన్ని నెలలుగా ప్రభుత్వంలో పెండింగ్లో ఉండగా, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో విద్యాశాఖ జీఓ నంబర్ 30ను జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం ప్రతి కళాశాలకు ఒకటి నుంచి ఐదు బీటెక్ కోర్సులు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు. ఒక్కో కోర్సులో కనిష్ఠంగా 15 నుంచి గరిష్ఠంగా 60 సీట్లు ఉంటాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే ఈ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. సీట్ల భర్తీ కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.
Details
వీరే బీటెక్ కోర్సుల్లో చేరేందుకు అర్హులు
పాలిటెక్నిక్ పూర్తి చేసి కనీసం ఒక సంవత్సరం ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్థులు ఈసాయంత్రం బీటెక్ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. బీటెక్ పూర్తి చేసిన వారు ఎంటెక్ కోర్సుల్లో కూడా ప్రవేశం పొందవచ్చు. ఈ కోర్సుల తరగతులు సాయంత్రం వేళల్లో నిర్వహించబడతాయి. అలాగే రెగ్యులర్ బీటెక్ కోర్సులకు ఉన్న ఫీజే ఈ కోర్సులకు కూడా వర్తిస్తుంది. ఇక ఎంటెక్ కోర్సుల విషయానికొస్తే, 2024లో జారీ చేసిన జీఓ ప్రకారం ఈసెట్ కన్వీనర్ ద్వారానే ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈసెట్ కన్వీనర్గా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య చంద్రశేఖర్కు ప్రవేశ పరీక్ష నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
Details
సాయంత్రం బీటెక్ కోర్సులకు అనుమతి పొందిన కళాశాలలు ఇవి
అదేవిధంగా ఎంటెక్ సీట్ల భర్తీకి కూడా ప్రభుత్వం జీఓ జారీ చేసినప్పటికీ, ఆ సీట్లను ఎలా భర్తీ చేయాలన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ప్రస్తుతం మూడు నుంచి నాలుగు కళాశాలల్లో మాత్రమే సాయంత్రం ఎంటెక్ కోర్సులకు అనుమతి లభించింది. 1. సీబీఐటీ 2. వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి 3. ఎంవీఎస్ఆర్ 4. స్టాన్లీ 5. మెథడిస్ట్ 6. ఎంజీఐటీ 7. మాతృశ్రీ 8. అబ్దుల్ కలాం 9. జయప్రకాశ్ నారాయణ్ (మహబూబ్నగర్) 10. అనుబోస్ (పాల్వంచ) 11. సిద్ధార్థ 12. సెయింట్ పీటర్స్.