Narendra Modi: మోదీ కాన్వాయ్ మార్గంలో పేలుడు పదార్థాల కలకలం.. ఎన్ఐఏ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో జెలటిన్ స్టిక్స్ లభ్యమైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేసు దర్యాప్తులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చేరిన నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూట్ శానిటైజేషన్ తనిఖీల సమయంలో పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఓ కార్డ్బోర్డ్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాక్స్లో జెలటిన్ స్టిక్స్తో పాటు బ్యాటరీలు, వైర్లు కలిగిన సర్క్యూట్ తరహా పరికరం కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
వివరాలు
ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ పరికరాలు, పేలుడు పదార్థాల వినియోగాన్ని పరిశీలిస్తున్న అధికారులు.. ఇవి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ (IED) తయారీ కోసం సేకరించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న పరికరం తక్షణ పేలుడు సంభవించేలా సిద్ధంగా లేదని, వెంటనే డిటోనేట్ అయ్యే పరిస్థితిలో కూడా లేదని ఉన్నత స్థాయి దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, ఇప్పుడు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగడంతో కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగింది.