Page Loader
Rythu Bharosa: 9 రోజుల్లో రైతుభరోసా పూర్తి.. ఖాతాల్లో రూ.8,284 కోట్లు
9 రోజుల్లో రైతుభరోసా పూర్తి.. ఖాతాల్లో రూ.8,284 కోట్లు

Rythu Bharosa: 9 రోజుల్లో రైతుభరోసా పూర్తి.. ఖాతాల్లో రూ.8,284 కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం పంపిణీని ప్రభుత్వం 9 రోజుల్లోనే పూర్తి చేయనుంది. రైతు భరోసా పథకం కింద 15 ఎకరాల వరకు ఉన్న రైతులకు సోమవారం ప్రభుత్వం రూ. 513.13 కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో గత 7 రోజుల్లోనే 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 8,284.66 కోట్ల సాయం జమ అయ్యింది. సాగులో ఉన్న మిగతా భూభాగాలకూ మంగళవారం నిధులను జమ చేయనున్నారు. ఈ నెల 16న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతుభరోసా సాయాన్ని ప్రారంభించారు.

Details

 నిధుల పంపిణీ వివరాలు

మొదటి రోజు 2 ఎకరాల వరకు, రెండో రోజు 3 ఎకరాల వరకు, మూడో రోజు 4 ఎకరాల వరకు, నాల్గో రోజు 5 ఎకరాల వరకు, ఐదో రోజు 6-7 ఎకరాల వరకు, ఆరవ రోజు (శనివారం) 8-9 ఎకరాల వరకు, ఏడో రోజు (సోమవారం) 10-15 ఎకరాల వరకు నిధులను విడుదల చేశారు. మొదటి రోజు: రూ. 2,349.83 కోట్లు రెండో రోజు: రూ. 3,901.73 కోట్లు మూడో రోజు: రూ. 5,215.26 కోట్లు నాల్గో రోజు: రూ. 6,404.70 కోట్లు ఐదో రోజు: రూ. 7,310.59 కోట్లు ఆరో రోజు: రూ. 7,770.83 కోట్లు ఏడో రోజు: రూ. 8,284.66 కోట్లు

Details

 విజయోత్సవ సభతో రైతుల పండగ 

రైతుభరోసా నిధుల పంపిణీ పూర్తయిన సందర్భంగా మంగళవారం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్ద రైతుల విజయోత్సవ సభ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు, కొందరు రైతుభరోసా లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో రైతు పండగను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఇందులో పాల్గొనాలని సూచించింది.