
Telangana: చౌటుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ డీఎస్పీలు దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఖైతాపూర్ వద్ద శుక్రవారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపైన ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో మరో ఇద్దరు ఉన్నారు. వీరిలో ఏఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నర్సింగరావును వెంటనే ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Details
ఏఎస్పీ పరిస్థితి విషమం
గాయపడిన ఏఎస్పీ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మృతులిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో సేవలందిస్తున్న అధికారులు. ఓ కేసు దర్యాప్తు నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.