
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం..వర్షంలో ఆడదాన్ని చెప్పినా వినలేదని పదేళ్ల కొడుకును హత్య చేసిన తండ్రి
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వర్షంలో ఆడుకోవాలని పట్టుబట్టిన పదేళ్ల కుమారుడిని కోపం తట్టుకోలేక తండ్రే కత్తితో పొడిచి హత్య చేశాడు. తండ్రి మాట వినకుండా ప్రవర్తించాడని పిల్లవాడిపై విరుచుకుపడ్డాడు.ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, సాగర్పూర్ ప్రాంతంలోని రియా కాలనీలో నివసిస్తున్న రాయ్ (40) అనే వ్యక్తి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతని భార్య మరణించింది. ప్రస్తుతం తన నలుగురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో జీవిస్తున్నాడు. అతని పిల్లల్లో మూడో సంతానంగా ఉన్న పదేళ్ల బాలుడు శనివారం రోజు వర్షం పడుతుండగా బయటికి వెళ్లి ఆడాలని పదేపదే తండ్రిని కోరాడు.
వివరాలు
ఘటనపై పోలీసులకు సమాచారం
అయితే తండ్రి రాయ్ దీనికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ బాలుడు పట్టుబడడంతో కోపం మరింత పెరిగిపోయింది. కోపంతో రాయ్ వంటగదిలోకి వెళ్లి అక్కడి నుంచి కత్తి తీసుకుని వచ్చి బాలుడి పక్కటెముక వైపు పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది. అనంతరం సమీపంలోని దాదా దేవ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆలస్యం అయిందని, బాలుడు మరణించాడని వైద్యులు ధృవీకరించారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
వివరాలు
సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు
పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడిని పరిశీలించి కత్తిపోట్లకు చనిపోయినట్లుగా నిర్ధారించారు. అనంతరం నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించగా, వర్షంలో ఆడాలన్న కుమారుడి పట్టుబట్టడంతో తనను కోపం వచ్చిందని, దాంతోనే కత్తితో పొడిచినట్లు అంగీకరించాడు. ఈ హత్యపై పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తండ్రి జైలుకు వెళ్లడంతో మిగిలిన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.