Ethanol Distilleries: ఎఫ్సీఐ బియ్యం ఎథనాల్ కంపెనీలకు 40% తక్కువ ధరకే విక్రయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఎథనాల్ తయారీ సంస్థలకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) బియ్యాన్ని సేకరణ ధర కంటే దాదాపు 40 శాతం తక్కువ ధరకే విక్రయించినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. 2025 జూన్ నుంచి 2026 జూన్ వరకు ఎథనాల్ డిస్టిలరీలకు క్వింటాల్కు రూ.2,250 నుంచి రూ.2,320 ధరకు బియ్యం సరఫరా చేసినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఈ 12 నెలల కాలంలో ఎఫ్సీఐ గోదాముల నుంచి మొత్తం 63.5 లక్షల టన్నుల బియ్యాన్ని ఎథనాల్ ప్లాంట్లకు పంపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ బియ్యం విలువ రూ.14,596.78 కోట్లుగా పేర్కొంది.
వివరాలు
హర్యానాకు 8,44,141 టన్నుల బియ్యం
రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా హర్యానాకు 8,44,141 టన్నుల బియ్యం కేటాయించారు.
తర్వాత ఉత్తరప్రదేశ్కు 8,38,645 టన్నులు, పంజాబ్-హిమాచల్ ప్రదేశ్కు కలిపి 6,58,952 టన్నులు, పశ్చిమ బెంగాల్కు 5,84,672 టన్నులు, మధ్యప్రదేశ్కు 4,32,485 టన్నులు సరఫరా చేశారు.
ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ (డొమెస్టిక్) కింద 2025 జూన్ నుంచి అక్టోబర్ వరకు క్వింటాల్కు రూ.2,250 చొప్పున, 2025 నవంబర్ నుంచి 2026 అక్టోబర్ వరకు రూ.2,320 చొప్పున ఎథనాల్ పరిశ్రమలకు బియ్యాన్ని విక్రయించారు.
ఇక 2026 నవంబర్ నుంచి 2027 జూన్ వరకు ఈ ధరను క్వింటాల్కు రూ.2,390గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
రైతుల నుంచి కొనుగోలు ఖర్చు మాత్రమే..
అయితే ఎఫ్సీఐ రైతుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసిన సగటు ధర దీనికంటే చాలా ఎక్కువగా ఉంది.
2024-25లో క్వింటాల్కు సగటు సేకరణ వ్యయం రూ.3,719.72 కాగా, 2025-26 సవరించిన అంచనాల ప్రకారం అది రూ.3,889.46కు పెరిగింది.
ఇందులో రైతుల నుంచి కొనుగోలు ఖర్చు మాత్రమే ఉంటుంది. నిల్వ, రవాణా, నిర్వహణ వంటి ఇతర వ్యయాలను కలిపితే మొత్తం ఆర్థిక వ్యయం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఎథనాల్ తయారీ సంస్థలకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ఓఎంఎస్ఎస్ ధరలకే బియ్యం విక్రయిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే సేకరణ ధర కంటే చాలా తక్కువకు ఎందుకు విక్రయిస్తున్నారనే విషయంపై మాత్రం సమాధానంలో వివరణ ఇవ్వలేదు.
వివరాలు
ఎఫ్సీఐ బియ్యాన్ని దారి మళ్లించిన రెండు ఘటనలు గుర్తించిన ప్రభుత్వం
ఇక ఎథనాల్ తయారీ కోసం కేటాయించిన ఎఫ్సీఐ బియ్యాన్ని దారి మళ్లించిన రెండు ఘటనలు గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
సంబంధిత డిస్టిలరీలపై రాష్ట్ర ఆహార శాఖలు చర్యలు తీసుకున్నాయని, వాటికి ఇకపై బియ్యం కేటాయింపులను నిలిపివేసినట్లు తెలిపింది.
అయితే ఆయా సంస్థల పేర్లను వెల్లడించలేదు. వ్యవసాయ నిపుణుడు,ఒక లిస్టెడ్ వ్యవసాయ సంస్థ స్వతంత్ర డైరెక్టర్ జి.కె. సూద్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యయం కంటే తక్కువ ధరకు బియ్యం విక్రయించడం పరోక్షంగా సబ్సిడీ ఇచ్చినట్టేనని అభిప్రాయపడ్డారు.
వివరాలు
72 లక్షల టన్నుల ఎఫ్సీఐ బియ్యాన్ని ఎథనాల్ ఉత్పత్తికి కేటాయించాలని నిర్ణయం
2026-27 ఎథనాల్ సరఫరా సంవత్సరానికి ప్రభుత్వం 72 లక్షల టన్నుల ఎఫ్సీఐ బియ్యాన్ని ఎథనాల్ ఉత్పత్తికి కేటాయించాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు.
టన్నుకు సుమారు రూ.23,900 ధరకు విక్రయిస్తుండగా, వాస్తవ ఆర్థిక వ్యయం దాదాపు రూ.43,100గా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ వ్యత్యాసాన్ని కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేయకపోతే చివరకు ఆ భారం ఆహార సబ్సిడీ బిల్లుపైనే పడుతుందని ఆయన అన్నారు.
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), ఇతర ప్రోత్సాహకాలతో ఇప్పటికే బియ్యం ఉత్పత్తికి భారీ మద్దతు ఇస్తున్న పరిస్థితిలో, అధిక నీటి వినియోగం అవసరమయ్యే ఈ పంటను పెద్దఎత్తున కొనుగోలు చేసి, తరువాత తక్కువ ధరకు ఎథనాల్ తయారీకి మళ్లించడం సమంజసమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని సూద్ వ్యాఖ్యానించారు.
వివరాలు
ఎథనాల్ మిశ్రమ కార్యక్రమానికి అనుగుణంగా ధరలు
బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్ సంస్థలు అమలు చేస్తున్న ఎథనాల్ మిశ్రమ కార్యక్రమానికి అనుగుణంగా ధరలను నిర్ణయించినట్లు కనిపిస్తోందని చెప్పారు.
ఇదిలా ఉండగా,ఎథనాల్ మిశ్రమ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ వద్ద ఉన్న అదనపు బియ్యం వినియోగాన్ని పెంచుతోంది.
ప్రస్తుతం 55 లక్షల టన్నులుగా ఉన్న కేటాయింపును 2026-27 ఎథనాల్ సరఫరా సంవత్సరానికి 72 లక్షల టన్నులకు పెంచింది.
వివరాలు
క్వింటాల్ బియ్యం ధర రూ.2,390గా నోటిఫై
ఈ కాలానికి క్వింటాల్ బియ్యం ధరను రూ.2,390గా నోటిఫై చేసింది.
ఎఫ్సీఐ రైతుల నుంచి కనీస మద్దతు ధరపై ఓపెన్-ఎండెడ్ సేకరణ విధానంలో బియ్యాన్ని కొనుగోలు చేస్తోంది.
ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు ఇతర సంక్షేమ పథకాల అవసరాల కంటే సేకరణ ఎక్కువగా ఉండటంతో, గత కొన్ని సంవత్సరాలుగా బియ్యం నిల్వలు బఫర్ ప్రమాణాలను మించి కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అదనపు నిల్వలను ఎథనాల్ ఉత్పత్తికి వినియోగించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.