దిల్లీ: పిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం; 20 మంది చిన్నారులు సేఫ్
దిల్లీలోని వైశాలి కాలనీలోని పిల్లల ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. న్యూ బోర్న్ చైల్డ్ హాస్పిటల్ భవనంలో గురువారం రాత్రి 11.35 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 20 మంది చిన్నారులను మంటల నుంచి రక్షించారు. భవనంలో మంటలు, పొగలు వ్యాపించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దాదాపు 8 అగ్నిమాపక వాహనాలు ఆసుపత్రి భవనంలో మంటలను ఆర్పడానికి అవిశ్రాంతంగా శ్రమించాయని దిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. సమయానికి అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశామని ఆయన చెప్పారు. పిల్లలందరినీ రక్షించిన తర్వాత వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు.