El Nino: వేగంగా బలపడుతున్న ఎల్నినో.. ప్రపంచానికి వాతావరణ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
రాబోయే కొన్ని నెలల్లో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్నినో ప్రభావం వేగంగా బలపడే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది. ఈ పరిణామం కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, అసాధారణ వాతావరణ మార్పులు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. సెప్టెంబర్ నాటికి ఎల్నినో బలమైన దశకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని సంస్థ వివరించింది. మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే అధికంగా పెరగడం, దానికి అనుబంధంగా పైభాగంలోని వాతావరణంలో అసాధారణ మార్పులు చోటుచేసుకోవడాన్ని ఎల్నినోగా వ్యవహరిస్తారు.
వివరాలు
దేశంలో ఎల్నినో పరిస్థితులు..
డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గతంలో ఇచ్చిన హెచ్చరికలకు అనుగుణంగా ఇది వేగంగా మరింత బలమైన దశకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జూన్ 12న దేశంలో ఎల్నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు ప్రకటించింది. అలాగే నైరుతి రుతుపవనాల కాలంలో ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశముందని కూడా వెల్లడించింది.
వివరాలు
94 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం..
ఎల్నినో ప్రభావంతో భారత్లో సాధారణంగా వర్షపాతం తగ్గుముఖం పడుతుంది. ఈ ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం సాధారణంతో పోలిస్తే సుమారు 40 శాతం మేర తగ్గింది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో 50.4 శాతం వరకు వర్షపాతం లోటు నమోదైంది. జూలై నెలలో కూడా దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం తగ్గే అవకాశం ఉందని ఐఎండీ జూన్ 30న అంచనా వేసింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఈ నెలలో సాధారణ వర్షపాతంలో సుమారు 94 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.