LOADING...
AP: గిరిజన ప్రాంతాల ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా
గిరిజన ప్రాంతాల ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా

AP: గిరిజన ప్రాంతాల ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలానికి చెందిన తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ప్రాంగణంలో ఇటీవల ఒక డ్రోన్‌ దిగింది. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ముందుగానే సేకరించి సిద్ధంగా ఉంచిన రక్త నమూనాలను ప్రత్యేక కిట్‌లో భద్రపరచి డ్రోన్‌లో ఉంచారు. అనంతరం డ్రోన్‌ వెంటనే జిల్లా కేంద్రం వైపు ప్రయాణించింది. మరుసటి రోజు అదే సమయంలో తిరిగి వచ్చిన డ్రోన్‌ సంబంధిత రక్త పరీక్షల నివేదికలను తీసుకువచ్చి ఆసుపత్రికి అందించింది. 23వ తేదీన చింతపల్లి పీహెచ్‌సీలో మలేరియా మందుల కొరత ఏర్పడగా, జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి (జీజీహెచ్‌) సమాచారం అందించారు. సమాచారం అందిన కేవలం 40 నిమిషాల్లోనే అవసరమైన ఔషధాలను డ్రోన్‌ ద్వారా అక్కడికి చేరవేశారు.

వివరాలు

'ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌' ప్రాజెక్టు ద్వారా సేవలు..

దూర ప్రాంత గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డ్రోన్‌ ఆధారిత ఆరోగ్య సేవల ప్రణాళిక ఇప్పుడు అమల్లోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో మందులు, రక్త యూనిట్లను వేగంగా పంపడంతో పాటు, అక్కడి నుంచి రక్తం, మల, మూత్ర నమూనాలను వైద్య పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి తరలించే విధానం విజయవంతంగా అమలవుతోంది. ఈ సేవల నిర్వహణ కోసం డ్రోన్‌ సేవల్లో అనుభవం కలిగిన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన రెడ్‌వింగ్‌ సంస్థతో రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గత ఏడాది డిసెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది. 'ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌' ప్రాజెక్టు కింద పాడేరు కేంద్రంగా ప్రాథమిక సేవలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

వివరాలు

మూడు దశల్లో సేవల విస్తరణ..

అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం డ్రోన్‌ ఆధారిత వైద్య సేవలను మూడు దశల్లో విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించారు. తొలి దశలో ఇప్పటికే ఎనిమిది ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రాజెక్టు అమలులోకి వచ్చింది. వీటిలో చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రి, ముంచంగిపుట్టు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ), భీమవరం, తాజంగి, సుంకరిమెట్ట, లోతుగెడ్డ, అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల నుంచి ప్రతిరోజూ రక్త నమూనాలను డ్రోన్ల ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అక్కడ పరీక్షలు పూర్తయిన తర్వాత, ముందు రోజు సిద్ధమైన నివేదికలతో పాటు అవసరమైన మందులను తిరిగి డ్రోన్ల ద్వారా సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు.

Advertisement

వివరాలు

పాడేరులో ఏర్పాటు చేసిన డ్రోన్‌ హబ్‌..

రెండో దశలో మరో పది వైద్య సంస్థలకు ఈ సేవలను విస్తరించనుండగా, మూడో దశలో జిల్లాలోని మిగిలిన అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఈ డ్రోన్‌ నెట్‌వర్క్‌లో చేర్చే ప్రణాళిక రూపొందించారు. డ్రోన్‌ సేవల నిర్వహణ కోసం పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సుమారు 80 సెంట్ల విస్తీర్ణంలో ప్రత్యేక డ్రోన్‌ హబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ వైద్య సంస్థలకు డ్రోన్‌ సేవలు అందిస్తున్నారు. ప్రతి ఆసుపత్రిలో డ్రోన్‌ కార్యకలాపాల నిర్వహణపై అవగాహన ఉన్న ఒక సిబ్బందిని నియమించడంతో పాటు, వైద్యులు సిద్ధం చేసిన నమూనాలు, మందులను డ్రోన్‌కు అందించడం, స్వీకరించడం కోసం మరో వ్యక్తిని కూడా బాధ్యతలు అప్పగించారు.

Advertisement