Khichdi In Bottles: సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తొలిసారిగా వేడి భోజనం.. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్లో 9 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా రెస్క్యూ టీమ్ కార్మికులకు వేడి ఆహారాన్ని అందించింది. వేడి వేడి కిచిడీ, వాటర్ బాటిళ్లను ప్రత్యేక పైపులైన్ ద్వారా కార్మికులకు పంపారు. ఇందుకోసం రెస్క్యూ బృందం టన్నెల్లోకి 6 అంగుళాల పైపును అనుసంధానం చేశారు. కార్మికులు 9రోజుల తర్వాత తొలిసారిగా వేడివేడి ఆహారాన్ని పంపినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక పైపులైన్ ద్వారా టన్నెల్లోకి ఆహారం, మొబైల్లు, ఛార్జర్లను పంపనున్నట్లు రెస్క్యూ ఆపరేషన్ ఇన్ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు సొరంగంలో ఉన్న కార్మికులకు ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్మికుల్లో ఆనందం
అరటిపండ్లు, యాపిల్స్, ఖిచ్డీ, దాలియా వంటి వాటిని కార్మికులకు పైపులైన్ ద్వారా పంపేందుకు వీలుగా మూత వెడల్పుగా ఉండే ప్లాస్టిక్ సిలిండర్ బాటిళ్లను తెస్తున్నామని ఆయన తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి, ప్రత్యేక పైపులైన్ ద్వారా ఆహారాన్ని పంపడం వంటి విషయాలను తెలుసుకున్న కార్మికులలో ఆనందం నెలకొందని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఐడీసీఎల్) డైరెక్టర్ అన్షు మనీష్ ఖుల్కో పేర్కొన్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కి చెందిన రెండు రోబోటిక్స్ యంత్రాలు నిర్దేశిత లక్ష్యంలో డ్రిల్ చేసేందుకు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. నవంబర్ 12న సిల్కిరా సొరంగం కూలిపోయిగా.. 41 మంది కార్మికులు అప్పటి నుంచి ఆ శిథిలాల కిందే ఉన్నారు.