Bihar Elections Result: బిహార్లో కౌంటింగ్ మొదటి రౌండ్.. పోస్టల్ ఓట్లలో ఎన్డీఏ ఆధిక్యం!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. ప్రారంభ దశలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈ రౌండ్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. తాజా లెక్కింపు వివరాల ప్రకారం ఎన్డీఏ 71 స్థానాల్లో, ఇండియా కూటమి 44 స్థానాల్లో, జన్ సురాజ్ పార్టీ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మధ్యాహ్నం కల్లా బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్, సర్వేలు సూచించినట్లుగానే ఎన్డీఏ బలంగా దూసుకెళ్తుండటంతో, కూటమి కార్యకర్తలు సంబరాలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్వీట్లు, బాణాసంచాలను ఎన్డీఏ శ్రేణులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Details
రాఘోపూర్లో తేజస్వి దూకుడు
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి గడచిన ఎన్నో ఏళ్లుగా బలమైన స్థావరంగా ఉన్న రాఘోపూర్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. 2015 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తేజస్వి, 2020 ఎన్నికల్లో 38,000 ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా విజయ దిశగా దూసుకెళ్తున్నారు. అలీపూర్లో మైథిలీ ఠాకూర్, తారాపూర్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆధిక్యంలో ఉంటే, మహూవా నుంచి లాలూ పెద్ద కుమారుడు తేజ్ప్రతాప్ యాదవ్ కూడా ముందంజలో దూసుకెళ్తున్నారు.