గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్దనున్న గౌతమి గోదావరి నదిలో భారీ పండుగప్ప చేప ఒకటి గంగపుత్రుల వలకు చిక్కింది. దాదాపు 15 కేజీల బరువుతో దొరికిన ఈ పండుగప్ప చేపను స్థానిక ఫిష్ మార్కెట్ లో వేలం వేశారు. దీంతో చేప ధర రూ.9 వేల ధర పలకింది. అయితే మత్స్యకార దంపతులైన పోనమండ భద్రం, రత్నంలు ఈ చేపను వేలంలో సొంతం చేసుకున్నారు. సముద్రం, గోదావరిలోనూ అరుదుగా వలకు చిక్కే పండుగప్ప రుచి చాలా బాగుంటుందని ఈ దంపతులు వెల్లడించారు.
సముద్రపు చేపల రుచుల్లో రారాజుగా పండుగప్ప
మరోవైపు గోదావరి నదిలోనూ ఈ పండుగప్ప చేపలు దొరకడం అత్యంత అరుదని మత్స్యకారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలోనూ గోదావరిలో 20 కేజీల పండుగప్ప దొరకిందని గుర్తు చేసుకున్నారు. ఈసారి వలకు చిక్కిన పండుగప్ప బరువు దాదాపు 15 కేజీల వరకు ఉంటుందని స్థానిక మత్స్యకారులు వివరించారు. సముద్ర చేపల రుచుల్లోనే రారాజుగా పండుగప్ప పేరు గడించిందని గంగపుత్రులు స్పష్టం చేశారు. పండుగప్ప చేప ప్రత్యేకత ఎంటంటే ఇది ఉప్పు నీటితో పాటు మంచి నీటిలోనూ పెరగుతుందన్నారు. ఈ చేప మాంసాహార జీవి అని, మానవ శరీరానికి కావాల్సిన ప్రొటీన్లలో చాలా వరకు ఈ చేపలో లభిస్తాయని వైద్యఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.