Hyderbad: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద.. గేట్లు ఎత్తివేత
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగర శివార్లలోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది. నిన్నటి నుంచి కురుస్తున్న నిరవధిక భారీ వర్షాల ప్రభావంతో ఈ రెండు జలాశయాలకు వరద నీరు వేగంగా చేరుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మాన్సాగర్ పూర్తిస్థాయికి చేరుకోవడంతో, అధికారులు 10 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఉస్మాన్సాగర్ నుంచి మూసీ నదిలోకి సుమారు 2,630 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అదే విధంగా, హిమాయత్సాగర్లో కూడా నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్సాగర్ నీటి మట్టం 1762.25 అడుగులు, ఉస్మాన్సాగర్ నీటి మట్టం 1788.85 అడుగులుగా నమోదైంది.
వివరాలు
మంచిరేవుల కల్వర్టుపై రాకపోకలు బంద్
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పరిస్థితి మరింత దిగజారితే, వారిని సమీప పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మంచిరేవుల కల్వర్టుపై నుంచి వరద నీరు పారుతుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.