Loading...
Hyderabad: 'భవ్య' పథకంతో హైదరాబాద్‌ శివార్లలో నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు
'భవ్య' పథకంతో హైదరాబాద్‌ శివార్లలో నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు

Hyderabad: 'భవ్య' పథకంతో హైదరాబాద్‌ శివార్లలో నాలుగు ఇండస్ట్రియల్‌ పార్కులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ చుట్టుపక్కల త్వరలో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'భారత్‌ ఆద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య)' పథకంలో భాగంగా టీజీఐఐసీకి చెందిన భూముల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల శివార్లలో పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది కేంద్రం ఉద్దేశం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడం 'భవ్య' పథకం ప్రధాన లక్ష్యం. ఒక్కో పార్కును 100 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ రూపంలో ఎకరాకు రూ.కోటి చొప్పున నిధులు అందిస్తుంది.

 వివరాలు 

వ్యూహాత్మక ప్రాంతాల ఎంపిక

ఈ మొత్తంతో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల్లో అత్యాధునిక మౌలిక వసతులు, అవసరమైన సదుపాయాలను అభివృద్ధి చేస్తుంది.

అనంతరం పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థలు ఏర్పాటు చేసే పరిశ్రమలకు భూములను కేటాయిస్తారు.

'భవ్య' పథకం కింద పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు టీజీఐఐసీ అధికారులు ఇప్పటికే అనువైన ప్రాంతాలను గుర్తించారు.

హైదరాబాద్‌కు 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో, రవాణా సదుపాయాలతో పాటు ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉండే టీజీఐఐసీ భూములను పరిశీలించారు.

రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం తిమ్మాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, మేడ్చల్‌ జిల్లాలోని ఘట్‌కేసర్‌ మండలం మాదారం, యాదాద్రి-భువనగిరి జిల్లాలోని దండుమల్కాపూర్‌ గ్రామాలను ఇందుకు అనువైన ప్రాంతాలుగా ప్రాథమికంగా గుర్తించారు.

వివరాలు 

దరఖాస్తు చేసిన వెంటనే స్థల కేటాయింపు

తిమ్మాపూర్, మాదారం ప్రాంతాలు ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్నాయి. ఎలిమినేడు భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి సుమారు ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉంది.

మరోవైపు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న దండుమల్కాపూర్‌లో ఇప్పటికే కొన్ని పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

దీంతో ఈ ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

కొత్త పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, బహుళజాతి సంస్థలకు వేగంగా స్థలాలు కేటాయించేలా టీజీఐఐసీ కార్యాచరణ రూపొందిస్తోంది.

దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన వెంటనే భూములు కేటాయించి, పరిశ్రమల నిర్మాణాన్ని కూడా త్వరితగతిన ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

నాలుగు పారిశ్రామిక కారిడార్లలో ఒక్కోదానికి ప్రత్యేకత ఉండేలా మాస్టర్‌ప్లాన్లను రూపొందించారు.

ADVERTISEMENT

వివరాలు 

సెమీకండక్టర్‌ పరిశ్రమలకు తిమ్మాపూర్

తిమ్మాపూర్‌ ప్రాంతం భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మహేశ్వరం పారిశ్రామికవాడకు సమీపంలో ఉండటంతో ఇక్కడ సెమీకండక్టర్‌ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించారు.

ఈ మేరకు సంబంధిత పరిశ్రమలకు అనువైన మౌలిక వసతులతో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు.

ఎలిమినేడులో ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ రంగం

ఎలిమినేడు పారిశ్రామిక పార్కులో ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రిక్‌ రంగాలకు చెందిన పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనుకూల వాతావరణం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

దండుమల్కాపూర్‌లో ఇంజినీరింగ్‌ పరిశ్రమలు

ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఉన్న దండుమల్కాపూర్‌లో ఇంజినీరింగ్‌ యంత్రాలు, పరికరాల తయారీకి సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

జాతీయ రహదారికి ఉన్న అనుసంధానం ఈ ప్రాంతానికి అదనపు ప్రయోజనంగా మారనుంది.

మాదారంలో ఐటీ, హార్డ్‌వేర్‌కు ప్రాధాన్యం

మాదారం పారిశ్రామిక పార్కులో ఐటీ, హార్డ్‌వేర్‌ రంగాలకు చెందిన పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీజీఐఐసీ అధికారులు తెలిపారు.

ఈ విధంగా నాలుగు ప్రాంతాల్లో వేర్వేరు రంగాలకు చెందిన పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారా హైదరాబాద్‌ చుట్టుపక్కల పారిశ్రామిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ADVERTISEMENT