Aadhaar Card: ఆధార్లో మార్పులు చేయించుకోవాలా? ఇప్పుడు ఫ్రీగా చేసుకునే ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆధార్ కార్డు ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది. ఆధార్లో ఉన్న బయోమెట్రిక్ వివరాలను ఉచితంగా మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ ఉచిత సేవ సెప్టెంబర్ 30వ తేది వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ అవకాశం అందరికీ కాదు. 5 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ వయస్సులో ఉన్న వారు తమ ఆధార్ బయోమెట్రిక్ వివరాలను ఎటువంటి రుసుము లేకుండా అప్డేట్ చేయించుకోవచ్చు. సాధారణంగా ఈ సేవలకు ఛార్జీలు ఉంటాయి. కానీ ఈ వయస్సు గల వారికి మాత్రం యూఐడీఏఐ ఎలాంటి ఫీజు తీసుకోదు.
వివరాలు
చివరి తేది ఎప్పుడంటే..
5 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నవారు తమ బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. చిన్న వయస్సులో తీసుకున్న ఆధార్లోని బయోమెట్రిక్ సమాచారం కాలక్రమేణా మారిపోతుంది. ఇది చేయకపోతే ఆధార్ ఆధారిత సేవలు పొందడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ధృవీకరణ సమయంలో బయోమెట్రిక్స్ పనిచేయకపోవచ్చు. కాబట్టి పిల్లలు కొంత వయస్సు చేరుకున్న తర్వాత తల్లిదండ్రులు వారి బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయించాలి. సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ఈ ప్రక్రియను ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 తర్వాత ఈ సేవను ఉపయోగించాలంటే నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఖర్చు లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
వివరాలు
ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఆధార్ సేవా కేంద్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో కూడా యూఐడీఏఐ ప్రత్యేక ఉచిత శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జరుగుతున్నాయి. ఈ శిబిరాల్లో విద్యార్థులు తమ ఆధార్ వివరాలను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఫీజు ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఈ శిబిరాలను నిర్వహిస్తుండగా, తెలంగాణలో కూడా ప్రభుత్వం ఇదే విధంగా కార్యక్రమాలు చేపడుతోంది. చాలా మంది విద్యార్థులు తమ ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయలేదు. అందుకే యూఐడీఏఐ ఈ ఉచిత సేవలను అందిస్తోంది.