Andhra Pradesh:ఏప్రిల్ నుంచి చేనేతలు,సెలూన్లకు ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఈ వార్తాకథనం ఏంటి
చేనేత కార్మికులు,సెలూన్లకు వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఆక్వా చెరువులను అధికారికంగా నమోదు చేసుకున్న రైతులకు యూనిట్కు రూ.1.50 చొప్పున విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు 1,02,535 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న 46 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వ్యవసాయ సీజన్ ప్రారంభమయ్యేలోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.
వివరాలు
మినీ సోలార్ ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా
విద్యుత్ ఛార్జీలు పెరగడం మాత్రమే చూసిన సందర్భాల్లో, తగ్గించడం చాలా అరుదని, అయితే మొదటిసారిగా యూనిట్కు 13 పైసలు తగ్గించడం ప్రశంసనీయమని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో మినీ సోలార్ ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా జరుగుతోందని, అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రోత్సహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.