
AP Rains: రాబోయే 4రోజుల్లో దక్షిణ కోస్తా,రాయలసీమలకు వర్ష సూచన
ఈ వార్తాకథనం ఏంటి
ఈ నెల 25 తర్వాత ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక 24వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే సుమారు 1.6 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదు కానున్నాయని అంచనా వేసింది. అదే సమయంలో రాబోయే నాలుగు రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వివరాలు
భారీ వర్షాలు పడే అవకాశం
ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. ప్రకాశం జిల్లా దర్శిలో 74.7 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లా చిట్టమూరులో 70 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా కురిచేడులో 69 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా నూజెండ్లలో 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారిక సమాచారం వెల్లడించింది.