Menaka Guruswamy: ఎల్జీబీటీక్యూ సముదాయం నుంచి రాజ్యసభకు.. ఎవరీ మేనకా గురుస్వామి?
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నాలుగు స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మేనకా గురుస్వామి పేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యాయవృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆమె ఎంపిక రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్లో ఖాళీ అవుతున్న అయిదు స్థానాల్లో నాలుగు టీఎంసీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్లను టీఎంసీ అభ్యర్థులుగా ప్రకటించింది. వీరందరిలో మేనకా గురుస్వామి ప్రత్యేక గుర్తింపు పొందారు.
Details
2018లో స్వలింగ బంధాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
ఆమె సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. 2018లో స్వలింగ బంధాలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించినప్పుడు, ఆ బంధాలను నేరంగా పరిగణించిన ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేసే ప్రక్రియలో కీలకంగా వాదించిన న్యాయవాదుల్లో ఆమె కూడా ఒకరు. ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ తదితర వర్గాలను సూచించే పదం) సముదాయానికి చెందిన వ్యక్తిగా ఆమె ఇప్పటికే సామాజిక రంగంలో గుర్తింపు పొందారు. ఒకవేళ రాజ్యసభకు ఎన్నికైతే, పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్జీబీటీక్యూ ఎంపీగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.