Page Loader
Telangana: కూరగాయలు,పండ్లు, పూల సాగుతో పలు ప్రయోజనాలు.. రాష్ట్ర ఉద్యాన శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
రాష్ట్ర ఉద్యాన శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

Telangana: కూరగాయలు,పండ్లు, పూల సాగుతో పలు ప్రయోజనాలు.. రాష్ట్ర ఉద్యాన శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
11:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యాన పంటల సాగును విస్తరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించవచ్చని, ఈ రంగానికి అనేక అవకాశాలున్నాయని ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కూరగాయలు, పండ్లు, పూల సాగు ద్వారా ఆహార భద్రత, పోషక విలువల కలిగిన ఆహారం, పర్యావరణ రక్షణ, ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి(livelihoods) వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయని వారు వివరించారు. ఉద్యాన పంటల వృద్ధిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలపై విశ్లేషణ కోసం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు 

అన్ని జిల్లాల్లో అధ్యయనం చేపట్టిన శాస్త్రవేత్తల బృందం

ఈ నేపధ్యంలో శాస్త్రవేత్తల బృందం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధ్యయనం చేపట్టి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు బాబు మాట్లాడుతూ, "ఉద్యాన పంటలు ప్రగతిశీల వ్యవసాయానికి దిశానిర్దేశకంగా నిలుస్తాయి. వీటి పంటకాలం తక్కువగా ఉండటంతో పాటు, దీర్ఘకాలిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఇవి మార్కెట్‌లో త్వరగా విక్రయించబడే ఉత్పత్తుల కావడంతో, రైతులకు వెంటనే ఆదాయం లభించే అవకాశముంది" అని చెప్పారు.

వివరాలు 

నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇవే: 

ఉద్యాన పంటలు ఆహార భద్రతలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి ఆహార నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. సాధారణ ఖరీఫ్ లేదా రబీ పంటలతో పోలిస్తే, ఉద్యాన పంటల సాగు విధానాలు మరింత సులభంగా ఉంటాయి. అంతేకాక, వీటి ద్వారా లభించే నికర లాభాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న స్థాయిలో, మూడు సభ్యులున్న ఒక కుటుంబం కూరగాయల సాగు చేపడితే నెలకు సుమారు రూ.13,000 నుండి రూ.15,000 వరకు ఆదాయం పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా సాగులో ఉద్యాన పంటల విస్తీర్ణం కేవలం 5.39 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఇవి మొత్తం వ్యవసాయ రంగానికి 27 శాతం స్థాయిలో స్థూల విలువ జోడింపు (Gross Value Addition - GVA) అందిస్తున్నాయి.