PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్ సీఎం వ్యంగ్యస్త్రాలు
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్లో పర్యటించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా నిర్వహించే సభలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంపై వివాదం తలెత్తింది. ప్రధానమంత్రి కార్యాలయం తన మూడు నిమిషాల ప్రసంగాన్ని కార్యక్రమం నుంచి తొలగించిందని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. అందుకే తమ రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా స్వాగతం పలకలేకపోతున్నానని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. అందుకే ప్రధాని మోదీని ట్వీట్ ద్వారా రాజస్థాన్కు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు అశోక్ గెహ్లాట్ తన ట్వీట్లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. గత ఆరు నెలల్లో ప్రధాని మోదీ రాజస్థాన్లో పర్యటించడం ఇది 7వ సారి.
అశోక్ గెహ్లాట్ ఆరోపణలపై స్పందించిన పీఎంఓ
అశోక్ గెహ్లాట్ వాదనకు విరుద్ధంగా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) స్పందించింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా గెహ్లాట్ను మోదీ కార్యక్రమానికి ఆహ్వానించామని, అయన ప్రసంగానికి స్లాట్ కూడా కేటాయించామని పీఎంఓ ట్వీట్ చేసింది. మోదీ కార్యక్రమానికి గెహ్లాట్ రాలేరని ముఖ్యమంత్రి కార్యాలయం తమకు తెలియజేసినట్లు పీఎంఓ పేర్కొంది. ఇప్పటికీ సమయం మించిపోలేదని, ఈరోజు కార్యక్రమంలో మీరు పాల్గొనచ్చని పీఎంఓ అశోక్ గెహ్లాట్ ట్వట్కు రీట్వీట్ చేసింది. అభివృద్ధి పనుల ఫలకంపై కూడా రాజస్థాన్ సీఎం పేరు ఉందని పీఎంఓ చెప్పింది. పీఎంఓ ట్వీట్పై అశోక్ గెహ్లాట్ మరోసారి స్పందించారు. 'గౌరవనీయులైన ప్రధాన మంత్రి, మీ కార్యాలయం నా ట్వీట్ను గుర్తించింది. కానీ బహుశా వారికి కూడా వాస్తవాల గురించి తెలియకపోవచ్చు' వ్యంగ్యాస్త్రాలు సంధించారు.