LOADING...
GHMC: జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడి షురూ.. నవంబరులో నోటిఫికేషన్‌?
జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడి షురూ.. నవంబరులో నోటిఫికేషన్‌?

GHMC: జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడి షురూ.. నవంబరులో నోటిఫికేషన్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2026
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని ప్రాంత పరిధిలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లలో ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం నవంబరులో ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అక్టోబరు రెండో వారానికి పూర్తికానుంది. ఆ జాబితా ఆధారంగా అదే నెలలో కొత్తగా ఏర్పాటు చేసిన డివిజన్లకు పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వం నిర్వహించిన బీసీ సర్వే నివేదికల ఆధారంగా డివిజన్ల రిజర్వేషన్లు నిర్ణయించబడతాయి. ఈ రెండు ప్రక్రియలు ముగిసిన వెంటనే నవంబరులో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు

తొలుత జీహెచ్‌ఎంసీకే ఎన్నికలు ఎందుకు?

మొదట జీహెచ్‌ఎంసీ ఎన్నికలకే ప్రాధాన్యం ఇవ్వడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 27మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన ప్రభుత్వం అనంతరం వాటిని మూడు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించింది. ఫిబ్రవరి 10, 2026న జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగియగా, మరుసటి రోజు పునర్విభజనలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ), సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(సీఎంసీ) ఏర్పాటయ్యాయి. ఈ మూడు కార్పొరేషన్లకు కూడా జీహెచ్‌ఎంసీ చట్టమే వర్తిస్తుంది. ఆచట్టం ప్రకారం పాలకమండలి గడువు ముగిసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన గతంలో ఎన్నికలు జరిగిన జీహెచ్‌ఎంసీకి మాత్రమే వర్తిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఎంఎంసీ, సీఎంసీల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని చెబుతున్నారు.

వివరాలు

రాజకీయ సమీకరణాలపై ఉత్కంఠ

పునర్విభజనతో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని స్థానిక సంస్థల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉండటంతో ఏ కార్పొరేషన్‌ను ఏ పార్టీ దక్కించుకుంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో స్పష్టత లేకపోవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రాతిపదికగా తీసుకుంటే జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో ఒక ప్రధాన పార్టీకి 60 నుంచి 70 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన డివిజన్లలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసిన తర్వాతే సీఎంసీ, ఎంఎంసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

వివరాలు

శివారు ప్రాంతాల్లో అయోమయం

పాత జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం మల్కాజిగిరి, సైబరాబాద్‌ నగరపాలక సంస్థలకు బదిలీ అయ్యాయి. మరోవైపు శంషాబాద్‌ నుంచి ఆదిభట్ల వరకు ఉన్న పలు స్థానిక సంస్థలు గ్రేటర్‌లో విలీనం అయ్యాయి. ఈ మార్పుల కారణంగా గ్రేటర్‌ ఎన్నికల్లో ఆయా ప్రాంతాల డివిజన్లలో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే విషయంలో రాజకీయ పార్టీలతో పాటు పరిశీలకుల్లోనూ గందరగోళం నెలకొంది. కొత్త భౌగోళిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఏ దిశగా మలుపుతిప్పుతాయన్న ఆసక్తి పెరుగుతోంది.

Advertisement