LOADING...
GHMC: ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా యాప్, వెబ్‌సైట్ రూపకల్పన
ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా యాప్, వెబ్‌సైట్ రూపకల్పన

GHMC: ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా యాప్, వెబ్‌సైట్ రూపకల్పన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులకు ఇక తెరపడనుంది. ఇకపై ప్రజలు తమ మొబైల్ ఫోన్ నుంచే ఇంటి నుండే అన్ని ముఖ్యమైన సేవలను పొందగలుగుతారు. అంతేకాకుండా, నగరానికి సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులను కూడా ఇకపై ఆన్‌లైన్‌లోనే నమోదు చేసే సదుపాయం కలుగనుంది. "ఒకే నగరం, ఒకే వెబ్‌సైట్, ఒకే మొబైల్ యాప్" అనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పూర్తిగా డిజిటల్‌ మాధ్యమాలపై ఆధారపడే కొత్త వేదికను అభివృద్ధి చేస్తోంది.

వివరాలు 

వివరాలను వెంటనే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం

ఈ కొత్త వెబ్‌సైట్,మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అయితే సరిపోతుంది. ఆ నంబర్‌కు అనుసంధానమైన ఆస్తి పన్ను వివరాలు, ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, పుట్టిన తేది ధృవీకరణ పత్రాలు, వ్యాపార లైసెన్సులు, పెంపుడు జంతువుల లైసెన్స్‌లు, గుత్తేదారుల డిపాజిట్లకు సంబంధించిన సమాచారం, క్రీడా సభ్యత్వ సంబంధిత వివరాలు వంటి అనేక సేవలు సులభంగా చూసుకోవచ్చు. అవసరమైతే ఈ వివరాలను వెంటనే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, త్వరలోనే కొన్ని సేవలకు సంబంధించిన దరఖాస్తులను కూడా డిజిటల్‌గా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫిర్యాదుల పరిష్కారం కోసం సమగ్రంగా పని చేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనున్నది.

వివరాలు 

ప్రస్తుత డిజిటల్ సేవలు.. కొత్త వేదిక అవసరం 

ప్రస్తుతం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి పన్నుల దరఖాస్తులు డిజిటల్ రూపంలో లభిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సేవలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అలాగే 'మై జీహెచ్ఎంసీ' మొబైల్ యాప్ ద్వారా కూడా ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఈ సేవలు పూర్తిస్థాయిలో ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయని, కొన్నివాటిలో సాంకేతిక పరిమితులు, లోపాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

వివరాలు 

ఉపయోగకరమైన ఫీచర్లతో కూడిన నూతన డిజిటల్ వేదిక

ఈ లోపాలను సవరించి, మరిన్ని ఉపయోగకరమైన ఫీచర్లతో కూడిన నూతన డిజిటల్ వేదికను అందించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చర్యలు ప్రారంభించారు. వినియోగదారుల మొబైల్ నంబర్ ఆధారంగా ప్రత్యేక ఖాతాను రూపొందించి,అందులో వారిని సంబంధించిన ధృవీకరణ పత్రాలు,రసీదులు, అనుమతులు వంటివన్నీ సులభంగా కనిపించేలా చేసే విధంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాల్సిందిగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు ఆయన ఆదేశాలు జారీ చేశారు.