LOADING...
Jual Oram: గిరిజన కళలకు గ్లోబల్‌ గుర్తింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
గిరిజన కళలకు గ్లోబల్‌ గుర్తింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

Jual Oram: గిరిజన కళలకు గ్లోబల్‌ గుర్తింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత గిరిజన కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గిరిజన కళాకారులకు స్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నూతన కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులను ప్రోత్సహించేందుకు 'రిసా: టైమ్‌లెస్ ట్రైబల్' పేరుతో ఒక ప్రీమియం సిగ్నేచర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం మార్చి 18, 2026న న్యూదిల్లీలోని సుందర్ నర్సరీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన కళలు శాశ్వతమైనవైనా, వాటికి సరైన గుర్తింపు లభించడం లేదన్నారు.

Details

గిరిజన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురావాలి

భారత్ ట్రైబ్స్ ఫెస్ట్, రిసా వంటి వేదికల ద్వారా గిరిజన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చి, లాభాలను సమానంగా పంచడం ద్వారా ఈ అంతరాన్ని తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సవిత్రి ఠాకూర్ కూడా ఈకార్యక్రమంపై స్పందిస్తూ, గిరిజన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. బిటిఎఫ్, రిసా వంటి కార్యక్రమాలు 'వోకల్ ఫర్ లోకల్' లక్ష్యాన్ని బలోపేతం చేస్తూ గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ప్రీమియం బ్రాండ్ అయిన 'రిసా'ద్వారా గిరిజన వస్త్రాలు, ఎంబ్రాయిడరీ, హస్తకళలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సంప్రదాయ పద్ధతులు, ఆధునిక మార్కెట్ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ వినియోగదారుల్లో ఆసక్తిని పెంచడం దీని ప్రధాన లక్ష్యం.

Details

గిరిజన ఉత్పత్తులను ఆధునిక రూపంలో అభివృద్ధి

ఈ కార్యక్రమం కింద పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. రూపకల్పన జోక్యాల ద్వారా కొత్త డిజైన్లు రూపొందించడం, గిరిజన ఉత్పత్తులను ఆధునిక రూపంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా కళాకారులకు శిక్షణ ఇచ్చి, వారి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా గిరిజన నేత, చేతివృత్తుల క్లస్టర్ల అభివృద్ధి, కుట్టు యూనిట్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. పర్యావరణానికి అనుకూలమైన ప్రీమియం ప్యాకేజింగ్‌ను అభివృద్ధి చేయడంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ హర్యానా భాగస్వామ్యం ఉంది.

Advertisement

Details

దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చే లక్ష్యం

ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జానీ-సందీప్ ఖోస్లా, మనీష్ త్రిపాఠి, అంజు మోడీ, గౌరవ్ జై గుప్తా, సమీరా దల్వి భాగస్వామ్యం వహిస్తున్నారు. ప్రారంభ దశలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన గిరిజన వస్త్రాలు, హస్తకళలను ప్రదర్శిస్తున్నారు. లాంగ్‌పి కుండలు (మణిపూర్), తుర్టుక్ ఇత్తడి కత్తులు(లడఖ్), డోఖ్రా కళాఖండాలు(ఛత్తీస్‌గఢ్) వంటి ప్రత్యేక ఉత్పత్తులు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. 'రిసా' కార్యక్రమం గిరిజన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా, భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ఒక కీలక అడుగు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 'వికసిత్ భారత్' దార్శనికతకు అనుగుణంగా, గిరిజన వర్గాలను దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది.

Advertisement