Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్న్యూస్.. 'తల్లికి వందనం' పథకంలో చేర్పు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి పిల్లలకు 2026-27 విద్యాసంవత్సరం నుంచే 'తల్లికి వందనం' పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 47,555 మంది గ్రామీణ, గిరిజన అంగన్వాడీ కార్యకర్తలు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లలు ఉన్న గ్రామీణ అంగన్వాడీ కార్యకర్తలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందనుంది. ఈ మేరకు విద్యాశాఖ సంబంధిత మార్గదర్శకాలను విడుదల చేసింది.
వివరాలు
గతంలో వేతనాన్ని కారణంగా చూపి పథకానికి దూరం
రాష్ట్రంలో మొత్తం 55,792 అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో - 42,860
గిరిజన ప్రాంతాల్లో - 4,695
పట్టణ ప్రాంతాల్లో - 8,237 కేంద్రాలు ఉన్నాయి.
అంగన్వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం ప్రభుత్వం నెలకు రూ.11,500 వేతనం చెల్లిస్తోంది.
సంక్షేమ పథకాల అమలుకు గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయ పరిమితి రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలుగా ఉండటంతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అంగన్వాడీ కార్యకర్తలు అనేక పథకాల నుంచి బయటపడ్డారు.
ఈ నిబంధనను కారణంగా చూపుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 'అమ్మఒడి' పథకాన్ని వారికి వర్తింపజేయలేదు.
తమకూ ఈ పథకం అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొంటున్నారు.
వివరాలు
ఆయాలకూ గతంలో నిరాశే
రాష్ట్రంలోని 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలను మినహాయిస్తే, మిగిలిన కేంద్రాల్లో 48,955 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు.
వీరికి ప్రభుత్వం నెలకు రూ.7,000 వేతనం చెల్లిస్తోంది. ఆదాయ పరిమితి నిబంధనలకు అర్హులైనప్పటికీ, సీఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు పొందుతున్న కారణంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి గతంలో 'అమ్మఒడి' పథకాన్ని నిలిపివేశారు.
అంతేకాకుండా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు అందుతున్న వితంతు పింఛన్లను కూడా రద్దు చేశారు.
వివరాలు
ఈ ఏడాదే అమలు.. 17 వేల మందికి లబ్ధి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'తల్లికి వందనం' పథకాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే సుమారు 17 వేల మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.