Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి లడ్డూ!
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తీపి కబురు అందించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ఆలయంలో సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా లడ్డూ ప్రసాదం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా ప్రత్యేకంగా 'లడ్డూ ఏటీఎం' మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త విధానంలో ముందుగా భక్తులు ఆన్లైన్ ద్వారా లడ్డూ ప్రసాదాన్ని బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ పూర్తయిన వెంటనే భక్తుడి మొబైల్ ఫోన్కు ఓటీపీ (OTP) వస్తుంది.
వివరాలు
గరిష్టంగా ఆరు లడ్డూలు పొందే అవకాశం
అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసే లడ్డూ ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లి ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే.. బుక్ చేసుకున్న లడ్డూ ప్రసాదం నేరుగా అందుతుంది.
ఈ ఏటీఎం మిషన్ల ద్వారా ఒక వ్యక్తి ఒక్కోసారి కనీసం ఒకటి నుంచి గరిష్ఠంగా ఆరు లడ్డూల వరకు పొందే అవకాశం ఉంటుంది.
దసరా నవరాత్రి ఉత్సవాల నాటికి ఆలయంలో మొత్తం ఆరు లడ్డూ ఏటీఎం మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
దసరాకు భారీగా లడ్డూ విక్రయాలు
ప్రతేడాది దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
ఈ సందర్భంగా సుమారు 30 లక్షల నుంచి 35 లక్షలకు పైగా లడ్డూ ప్రసాదం విక్రయాలు జరుగుతుంటాయి.
ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆలయంలో రద్దీని నియంత్రించడంతో పాటు లడ్డూ ప్రసాదం విక్రయాలను మరింత వేగవంతం చేసేందుకు డిజిటల్ 'లడ్డూ ఏటీఎం' విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.