
Google CEO Sundar Pichai: ఏఐ హబ్ ఓ కీలక మైలురాయి: మోదీకి సుందర్ పిచాయ్ ఫోన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలో 1 గిగావాట్ సామర్థ్యమున్న హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ తో చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంలో టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. విశాఖలో ఏర్పాటు కానున్న తమ కంపెనీ తొలి ఏఐ హబ్ గురించి ప్రధానితో పంచుకున్నారు. ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ తన ఎక్స్ (X) పోస్ట్లో వెల్లడించారు.
వివరాలు
విశాఖలో గూగుల్ తొలి ఏఐ హబ్
"విశాఖలో గూగుల్ తొలి ఏఐ హబ్ గురించి ప్రధాని మోదీతో మాట్లాడటం జరిగింది.ఈ ఏఐ హబ్ ఒక కీలక మైలురాయి గా నిలుస్తుంది.ఇక్కడ గిగావాట్ సామర్థ్యం కలిగిన హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్సీ గేట్వే, అధిక స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఏర్పాటవుతాయి.ఈ హబ్ ద్వారా అధునాతన సాంకేతికతను భారత్లో సంస్థలు,వినియోగదారులకు అందించగలుగుతాము. కృత్రిమ మేధా ఆవిష్కరణలను మరింత వేగవంతం చేస్తాం"అని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. దిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,గూగుల్ మధ్య మంగళవారం ఈ ఒప్పందంఅధికారిక స్థాయిలో కుదిరింది.
వివరాలు
విశాఖ నుండి 12 దేశాలతో సబ్సీ కేబుల్ వ్యవస్థ
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ,కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ రాబోయే ఐదు సంవత్సరాలలో సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్లో ఇది గూగుల్ అత్యంత పెద్ద పెట్టుబడి అవుతుంది. ఒప్పందాన్ని ప్రకటిస్తూ, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా తీర్చిదిద్దడం లక్ష్యమని తెలిపారు. విశాఖ నుండి 12 దేశాలతో సబ్సీ కేబుల్ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేయబడుతుందని కూడా తెలిపారు.