West Bengal: రాజీనామా చేయనన్న మమతకు షాక్.. బెంగాల్ అసెంబ్లీ రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయనని స్పష్టం చేసిన నేపథ్యంలో గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీని రద్దు చేశారు. గురువారం అర్ధరాత్రితో అసెంబ్లీ పదవీకాలం ముగియాల్సి ఉండగా, సాయంత్రం రాజ్ భవన్ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(2)(బి) ప్రకారం అసెంబ్లీని మే 7, 2026 నుంచి రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ఒక లైన్ ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ రద్దవుతుంది.
వివరాలు
ఎన్నికల ఫలితాలను కోర్టులో సవాల్ చేయనున్న తృణమూల్ కాంగ్రెస్
కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుత మంత్రివర్గం తాత్కాలికంగా కొనసాగుతుంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కూడా తాను ఓడిపోలేదని, బీజేపీకి వచ్చిన మెజారిటీ 'దోపిడీ' ఫలితమని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. "నేను ఓడిపోలేదు.. రాజ్ భవన్కు వెళ్లను.. రాజీనామా చేయను" అంటూ ఆమె స్పష్టం చేయడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ నేతలు ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయగా, ప్రతిపక్ష కూటమి ఆమెకు మద్దతుగా నిలిచింది. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలను కోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రకటించింది.