Telangana: స్త్రీనిధిలో 163 నియామకాలకు గ్రీన్ సిగ్నల్: మంత్రి సీతక్క
ఈ వార్తాకథనం ఏంటి
స్త్రీనిధి సంస్థలో సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని 163 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి సీతక్క వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని ఆమె తెలిపారు. సంస్థ పనితీరు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. స్త్రీనిధి నిధులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించినా, గ్రామీణ,పట్టణ స్థాయిలో రుణాల మంజూరు, రికవరీ నిధుల విషయంలో ఎలాంటి దుర్వినియోగం జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వివరాలు
అవకతవకలపై 16 మందిపై చర్యలు
సోమవారం సచివాలయంలో స్త్రీనిధి కార్యకలాపాలపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటివరకు రూ.2,064 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందజేసినట్లు వెల్లడించారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ రుణాల పంపిణీ లక్ష్యంలో 90 శాతం మేర సాధించగలిగామని చెప్పారు. గతంలో అవకతవకలకు పాల్పడిన 16 మంది సిబ్బందిపై చర్యలు తీసుకుని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు మంత్రి వివరించారు. అలాగే సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రతిభ ఆధారంగా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.