Paper Leak: పేపర్ లీక్లపై కేంద్రం కఠిన చర్యలు.. 10 ఏళ్ల జైలు.. రూ.కోటి వరకు జరిమానా..?
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పేపర్ లీక్లకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన నిర్ణయాలను శుక్రవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ వీడియో ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో కీలక మార్పులు చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వివరాలు
నిబంధనలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ప్రస్తుతం అమల్లో ఉన్న 2024 ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టం ప్రకారం ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో దోషులకు 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
అయితే ఈ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతిపాదిత సవరణల ప్రకారం,పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు గరిష్ఠంగా రూ.1 కోటి వరకు జరిమానా విధించేలా చట్టాన్ని సవరించే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది.
వివరాలు
ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయని కేంద్ర ప్రభుత్వం
ఈ ప్రతిపాదిత మార్పులకు శుక్రవారం సాయంత్రం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశమున్నట్లు సమాచారం.
అనంతరం వచ్చే వారంలో దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ చట్ట సవరణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.