Pipri Lift Irrigation Project : పిప్రి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. సవరించిన అంచనా రూ. 77 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో శ్రీరాంసాగర్ వెనుక జలాలను ఆధారంగా తీసుకుని నిర్మిస్తున్న పిప్రి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూ.77.07 కోట్ల వ్యయానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ ప్రాజెక్టు అంచనాలను సవరించేందుకు ఆమోదం లభించింది. వాస్తవానికి 2021లో ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను రూ.58.95 కోట్ల అంచనాతో ప్రారంభించారు.
Details
గతంలో పనులు మధ్యలోనే నిలిపివేత
అయితే అవసరమైన నిధులు సమకూరకపోవడంతో ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ పథకం ద్వారా మొత్తం ఆరు గ్రామాల పరిధిలోని సుమారు 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం వ్యయ అంచనాలు పెరగడంతో సవరించిన రూ.77.07 కోట్లకు అనుమతి ఇస్తూ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం, నిర్వహణ బాధ్యతలతో పాటు ఐదేళ్లపాటు సంరక్షణ బాధ్యతలను కూడా గుత్తేదారు సంస్థకే అప్పగించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.