Heavy Rains: తెలంగాణలో విస్తార వర్షాలు.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో 5.8 సెంటీమీటర్లు నమోదైంది. అదే జిల్లాలోని తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4.2 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 4 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 3.8 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా మొహమ్మద్నగర్ మండలం మొగ్దంపూర్లో 3.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
వివరాలు
రహదారులపై నీరు
జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి.
మరోవైపు సోమవారం రాత్రి మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో అత్యధికంగా 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
జీహెచ్ఎంసీ పరిధిలో కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది.
పలుచోట్ల వరదనీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. ప్రధాన కూడళ్లలోట్రాఫిక్ జామ్లు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వివరాలు
పది జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఉత్తర ఒడిశా,పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం నాటికి దక్షిణ ఝార్ఖండ్,ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.
అలాగే రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది.
ఈ ప్రభావంతో బుధవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్,కుమురం భీం ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,నిజామాబాద్,జగిత్యాల, వికారాబాద్,సంగారెడ్డి,మెదక్, కామారెడ్డి జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక (ఎల్లో అలర్ట్) జారీ చేసింది.
మిగిలిన జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
గురువారం, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
వివరాలు
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్ సంజయ్ జాజు
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన పలు కీలక సూచనలు చేశారు.
అన్ని శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న బృందాలను కూడా ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు.
వివరాలు
ములుగులో సుడిగాలి బీభత్సం
వ్యవసాయశాఖ రూపొందించిన ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విత్తన మేళాలు కొనసాగుతున్నాయని, రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సహాయం, ఇతర సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నదీం అహ్మద్, కార్యదర్శులు దాసరి హరిచందన, సురేంద్ర మోహన్ పాల్గొన్నారు.
వివరాలు
ములుగులో సుడిగాలి బీభత్సం
ములుగు జిల్లా మంగపేట మండలంలో మంగళవారం సాయంత్రం సుడిగాలి బీభత్సం సృష్టించింది.
సండ్రోని ఒర్రె సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు కూకటివేళ్లతో నేలకూలాయి.
కోమటిపల్లి వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నీలగిరి చెట్లు సహా అనేక వృక్షాలు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అలాగే 11 కేవీ విద్యుత్ లైన్పై చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న ఇన్ఛార్జి ఎఫ్ఆర్వో మహ్మద్ లాయక్ హుస్సేన్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
చెట్ల తొలగింపు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.