Badrinath Donation Row: బద్రీనాథ్ విరాళాల అవకతవకలు.. ఉన్నతస్థాయి విచారణకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆలయ విరాళాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కమిటీకి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన సంస్కరణలపై నివేదిక సిద్ధం చేసి బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ)కి సిఫారసులు చేయాలని సూచించింది.
వివరాలు
బీకేటీసీ ఆధ్వర్యంలో బద్రీనాథ్తో పాటు మరో 44 ఆలయాల నిర్వహణ బాధ్యతలు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్తో పాటు మరో 44 ఆలయాల నిర్వహణ బాధ్యతలు బీకేటీసీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అదనంగా పలు విద్యాసంస్థలు, ధర్మశాలల నిర్వహణను కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తోంది. ఇదిలా ఉండగా, ఆలయ విరాళాల వ్యవహారంలో అక్రమాలకు బాధ్యులు ఎవరో గుర్తించేందుకు అధికారులు ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన విరాళాల రికార్డులు, నగదు నిర్వహణ విధానం,విరాళాల సేకరణ,నగదు లెక్కింపు ప్రక్రియతో పాటు సంబంధిత అన్ని పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
అక్రమాలపై బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ అంతర్గత విచారణ
ఆలయ కమిటీ వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మరోవైపు, విరాళాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించింది. ప్రాథమిక విచారణలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో ప్రమోద్ నౌట్యాల్ అనే ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది వెల్లడించారు. విచారణ పూర్తైన తర్వాత బాధ్యులపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.