Hyderabad: న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల వేళల పొడిగింపు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త అందింది. డిసెంబర్ 31న మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. సాధారణంగా మెట్రో చివరి సర్వీస్ రాత్రి 11 గంటలకే ముగుస్తుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా బుధవారం రాత్రి ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు ఒంటిగంటకు బయలుదేరనుందని అధికారులు తెలిపారు.
Details
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
వేడుకల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మెట్రో రైళ్లలోనే కాకుండా స్టేషన్ల వద్ద కూడా అదనపు సిబ్బంది, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎల్అండ్టీ అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలను ఆనందంగా జరుపుకుంటూనే, ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.