New Traffic Challan Plan: ట్రాఫిక్ చలాన్లకు కొత్త విధానం.. ఫాస్టాగ్ ఖాతా నుంచే జరిమానా వసూలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల నుంచి జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతాల నుంచి వసూలు చేసే విధానాన్ని తీసుకురావడంపై అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ విధానం అమలుపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులతో చర్చలు జరుపుతున్నామని, దీనిపై వారి అధికారిక స్పందన రావాల్సి ఉందని తెలిపారు. ఇటీవల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో సున్ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 'ప్రజలు, భాగస్వామ్యం, సాంకేతికత ద్వారా సురక్షితమైన రహదారుల నిర్మాణం' అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ప్యానలిస్ట్గా పాల్గొన్నారు.
వివరాలు
టెక్నాలజీతో ట్రాఫిక్ నిబంధనల అమలును పటిష్ఠం చేసేందుకు యోచన
ఈ సందర్భంగా సున్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత సమర్థవంతంగా,పటిష్ఠంగా మార్చడమే ఫాస్టాగ్ ఆధారిత వసూలు ప్రతిపాదన ఉద్దేశమని వివరించారు.
కేవలం జరిమానాలు విధించడం ద్వారా మాత్రమే వాహనదారుల ప్రవర్తనలో దీర్ఘకాలిక మార్పు తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చని అన్నారు.
బాధ్యతాయుతమైన డ్రైవింగ్ను ప్రోత్సహించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు.
గత రెండుదశాబ్దాల్లో హైదరాబాద్ నగరం వేగంగా విస్తరించి అభివృద్ధి చెందిందని సున్ప్రీత్ సింగ్ తెలిపారు.
నగర విస్తరణతో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో పాటు ప్రాణాంతక రోడ్డుప్రమాదాలు కూడా అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రహదారి భద్రతను కేవలం ప్రభుత్వ బాధ్యతగా చూడకూడదని.. ఇందులో పౌరులకూ సమాన భాగస్వామ్యం,బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
వివరాలు
మెరుగైన ప్రజా రవాణా, పార్కింగ్ సౌకర్యాలు అవసరమని వెల్లడి
ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడంతో పాటు లాస్ట్-మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయాలని సూచించారు.
అలాగే మల్టీ-లెవల్ పార్కింగ్ సదుపాయాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగరంలోని రద్దీని కొంతవరకు నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ విభాగాలు, పోలీసు శాఖ, సాంకేతికత అందించే సంస్థలు, ప్రజల మధ్య సమన్వయం, భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని సున్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
ఈ వర్గాలన్నీ కలిసి పనిచేసినప్పుడే హైదరాబాద్లో రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు ట్రాఫిక్ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.