Tamil Nadu Government Formation: విజయ్కి లైన్ క్లియర్.. రేపు ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉత్కంఠకు దారితీసిన తమిళనాడు రాజకీయాల్లో చివరికి అనిశ్చితికి తెరపడింది. అత్యధిక స్థానాలు సాధించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేశారు. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ను నియమిస్తూ లోక్భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో శనివారం గవర్నర్ను కలిసిన విజయ్, తనకు మద్దతు తెలిపిన పార్టీల లేఖలను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
వివరాలు
ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం
మెజార్టీ మార్క్ (118)ను చేరుకోవడంతో గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆదివారం ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే మే 13వ తేదీలోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచించారు.
వివరాలు
క్యాబినెట్ పదవులు వద్దన్న వీసీకే
ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మద్దతు ఇస్తున్న వీసీకే, క్యాబినెట్లో చేరబోమని స్పష్టం చేసింది. "మేం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోము. వెలుపలి నుంచే మద్దతు కొనసాగిస్తాం. భవిష్యత్తులో ప్రభుత్వంలో చేరాలా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. రాష్ట్రపతి పాలన రాకుండా, ప్రజల తీర్పు అమలయ్యేలా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తున్నామని వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియాకు వెల్లడించారు. ఇదే విధంగా వామపక్షాలు కూడా ఇప్పటికే క్యాబినెట్ పదవులు స్వీకరించమని ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నై సమీపంలోని టీవీకే ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్ వద్ద భద్రతను భారీగా పెంచారు.
వివరాలు
పార్టీ వారీగా బలాలు ఇలా ఉన్నాయి
టీవీకే : 107 కాంగ్రెస్ : 5 సీపీఐ : 2 సీపీఎం : 2 వీసీకే : 2 ఐయూఎంఎల్ : 2 మొత్తం మద్దతు సంఖ్య 120కు చేరినట్లు సమాచారం.