ICMR: ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్ తాజా నివేదిక
ఇటీవల కాలంలో యువతలో నమోదవుతున్న ఆకస్మిక మరణాలతో కోవిడ్ వ్యాక్సిన్కు ఎలాంటి సంబంధం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) తేల్చి చెప్పింది. ఈ 'సడెన్ డెత్' లు వ్యక్తిగత కారణాల వల్లే జరుగుతున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలిందని పేర్కొంది. వాస్తవానికి కొవిడ్-19 వ్యాక్సిన్ కనీసం ఒక్క డోసు తీసుకున్నా మరణాల రిస్క్ తగ్గుతుందని తెలిపింది. 18-45 ఏళ్ల గ్రూపుల వారిపై అధ్యయనం చేయగా కోవిడ్ వ్యాక్సిన్ (Covid Vaccine) తీసుకున్నవారిలో సహఅనుబంధ వ్యాధులు, సడెన్ డెత్ లు గుర్తించలేదని ధ్రువీకరించింది.
పలు కారాణాలే వల్లే మరణాలు
729 కేసులు, 2,916 పర్యవేక్షణలను పరిశీలించగా, ఈ అధ్యయనంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆకస్మిక మరణాల ముప్పు తక్కువగా ఉందని పేర్కొంది. ఈ మరణాలకు ధూమపానం, తీవ్ర శ్రమ, మరణించడానికి 48 గంటల ముందు మద్యం సేవించడం, వివిధ ఆహారపు అలవాట్లు కావచ్చని స్పష్టం చేసింది. దేశంలో ఆకస్మిక మరణాలు పలు కారణాల వల్ల సంభవిస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అకస్మాత్తు మరణాల రిస్క్ తక్కువగా ఉందని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఈ రిస్క్ మరింత తక్కువగా ఉందని తెలిపింది.