
Rapid Ragi: 'ర్యాపిడ్ రాగి'.. ఇక్రిశాట్ నుంచి మరో నూతన వంగడం.. 68 రోజుల్లోనే పంట చేతికి..
ఈ వార్తాకథనం ఏంటి
ఆహారపు అలవాట్లు మారటంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో... పోషక విలువలతో కూడిన చిరుధాన్యాలు మార్గదర్శకంగా మారుతున్నాయి. రాగులు,సజ్జలు,జొన్నలు,కొర్రలు,ఊదలు,సామలు,అరికెల వంటి ధాన్యాలపై ప్రజల ఆసక్తి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీటి వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు విస్తృత స్థాయిలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మెట్టప్రాంత పంటల పరిశోధనా సంస్థ అయిన ఇక్రిశాట్...రాగులపై చేసిన పరిశోధనల ఫలితంగా 'ర్యాపిడ్ రాగి' అనే కొత్త రకాన్ని అభివృద్ధి చేసింది. శనగలు,కందుల వంటి పంటల మీద ప్రయోగించిన స్పీడ్ బ్రీడింగ్ ప్రక్రియను రాగులపై కూడా ప్రయోగించి, శాస్త్రవేత్తలు కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ కొత్త రకాన్ని తయారుచేశారు. ఇది సంప్రదాయ రకాలతో పోలిస్తే ఎంతో మెరుగైనదిగా గుర్తింపు పొందింది. తాజాగా దీన్ని అధికారికంగా విడుదల చేశారు.
వివరాలు
కేవలం 68 రోజుల్లో పంట చేతికి..
ఇది రైతులకు, వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలను కలిగించనుంది. దేశంలో జొన్నలు, సజ్జల తర్వాత రాగి మూడో ముఖ్యమైన చిరుధాన్యంగా గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు లక్ష ఎకరాల్లో, తెలంగాణలో సుమారు 13 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న వంగడాలతో ఈ పంటకు 135 రోజుల వ్యవధి అవసరమవుతుండటంతో ఏడాదికి గరిష్టంగా రెండు పంటలే పండించగలిగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఇక్రిశాట్ అభివృద్ధి చేసిన 'ర్యాపిడ్ రాగి' వంగడంతో కేవలం 68 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ విధంగా ఏడాదికి ఐదు పంటల వరకూ పండించగల అవకాశముంది. ఈ విత్తనం వేగంగా మొలకెత్తి, తక్కువ పూతతోనే మొక్క వేగంగా ఎదుగుతుంది.
వివరాలు
కొత్త రకం ద్వారా సంవత్సరానికి 75 నుంచి 100 టన్నుల దిగుబడి
అంతేకాకుండా ఇది అధిక కాంతిని, ఎక్కువ ఉష్ణోగ్రతను, తక్కువ నీటి లభ్యతను తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాగి రకాలకు సగటున 26 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. కానీ 'ర్యాపిడ్ రాగి' రకం తక్కువ ఉష్ణోగ్రతలకే సరిపోతూ, ఎక్కువ దిగుబడిని అందించగలుగుతుంది. ప్రస్తుతం ఒక ఎకరా రాగి పంటకు 7.5 నుంచి 10 టన్నుల మధ్య దిగుబడి వస్తోంది. అంటే ఏడాదికి ఎక్కువగా 15 నుంచి 20 టన్నుల దిగుబడి మాత్రమే లభిస్తుంది. కానీ కొత్త రకం ద్వారా సంవత్సరానికి 75 నుంచి 100 టన్నుల దిగుబడి సాధ్యమవుతుందని అంచనా.
వివరాలు
'ర్యాపిడ్ రాగి' అత్యుత్తమ రకం
ఇక్రిశాట్ సీనియర్ శాస్త్రవేత్త శోభన్ సజ్జా మాట్లాడుతూ, ఈ 'ర్యాపిడ్ రాగి' అత్యుత్తమ రకం అని, ఇది రైతులకు మంచి లాభాలను తీసుకురావడమే కాకుండా, చిరుధాన్యాల సాగును రెండున్నర రెట్లు పెంచగలదని తెలిపారు. ఈ విధంగా మరింత మందికి చిరుధాన్యాల లభ్యత పెరుగుతుందని చెప్పారు. అలాగే భవిష్యత్తులో ఇతర చిరుధాన్యాలపై కూడా మరిన్ని పరిశోధనలు చేసి, నూతనమైన, మెరుగైన రకాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన స్పష్టంచేశారు.