Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. డబ్బులు పడాలంటే ఆ కార్డు ఉండాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా, గ్రామాలు, పట్టణాల్లో విడతల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తొలి విడతలో సుమారు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వీటికి వివిధ నిర్మాణ దశల్లో కొనసాగుతుంది. ఈ పథకంలో లబ్ధిదారుడికి రూ. 5 లక్షల నగదు సహాయం అందజేస్తున్నారు. అందులో రూ. 4.40 లక్షలను విడతల వారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. మిగతా రూ. 60,000ను ఉపాధి హామీ పథకం కింద శౌచాలయం నిర్మాణం, కూలీల వేతనం ద్వారా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Details
కొత్త జాబ్ కార్డులు మంజూరు కాలేదు
ఈ మొత్తాన్ని పొందాలంటే ఇంటి లబ్ధిదారులకు ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరి. కానీ తెలంగాణలో గత ఏడాదీ నుంచి ఉపాధి హామీ పథకం కింద కొత్త జాబ్ కార్డులు మంజూరుకు రాలేదు. దాంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి రెండు ప్రధాన పథకాల అమలు ఈ జాబ్ కార్డు సమస్య కారణంగా ఆలస్యం అవుతోంది. కొత్త జాబ్ కార్డుల కోసం దరఖాస్తులు ఉన్నా, ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లేకపోవడం వల్ల లబ్ధిదారులకు సమస్యలే మిగిలింది. ఉపాధి జాబ్ కార్డును లింక్ చేయడం ప్రధాన సమస్యగా మారింది.
Details
సమస్య పరిష్కారం ప్రజల ఎదురుచూపు
అనేక లబ్ధిదారులకు జాబ్ కార్డు లేకపోవడంతో రూ. 60,000 బిల్లు చెల్లింపులో ఆందోళన నెలకొంది. అధికారులు తాత్కాలికంగా పరిష్కారం చూపిస్తున్నారు. కుటుంబంలోని ఎవరికైనా జాబ్ కార్డు ఉంటే, ఇంటి యజమాని పేరును కూలీగా చేర్చి ఆ కార్డు ద్వారా రూ. 60,000 బిల్లును మంజూరు చేస్తున్నారు. అయితే, కుటుంబంలో ఎవరికీ జాబ్ కార్డు లేకపోవడం వల్ల నిరుపేదలకు సమస్య పరిష్కారం లేకపోవడం కొనసాగుతోంది. లబ్ధిదారులు ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని కోరుతున్నారు.