పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ సత్తా చాటుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్టీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం సాయంత్రం సమయానికి రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాల ఆధారంగా 15, 068 గ్రామ పంచాయతీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ 3,421 స్థానాలను కైవసం చేసుకుంది. సీపీఐ(ఎం) 1,392 స్థానాలు, కాంగ్రెస్ 829 స్థానాలను దక్కించుకున్నాయి. కొత్తగా ఏర్పాటైన ఐఎస్ఎఫ్తో సహా ఇతర పార్టీలు 1,362సీట్లను గెలుచుకున్నాయి. టీఎంసీ రెబల్స్, స్వతంత్రులు 718 స్థానాల్లో గెలిచి, మరో 216 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మరో రెండు రోజులు పాటు ఓట్లు లెక్కింపు: ఎన్నికల అధికారులు
గ్రామ పంచాయతీతో పాటు మూడంచెల పంచాయతీ వ్యవస్థలోని మొత్తం 74,000 సీట్లకు ప్రస్తుతం ఓట్లు లెక్కింపు జరుగుతోంది. ఇందులో 9,730 పంచాయతీ సమితి, 928 జిల్లా పరిషత్ స్థానాలు ఉన్నాయి. గట్టి భద్రత నడుమ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, ప్రశాంతంగా సాగుతోంది. 22 జిల్లాల్లో 339 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దక్షిణ 24 పరగణాల్లో గరిష్టంగా 28 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. కనిష్టంగా కాలింపాంగ్లో నాలుగు కేంద్రాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు రాబోయే రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. బ్యాలెట్లను లెక్కించడానికి, ఫలితాలను కంపైల్ చేయడానికి సమయం పడుతుందని చెబుతున్నారు.