పోలీసు పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ.. తెలుగు రాష్ట్రాలలో ఎంతమందికంటే..?
2023 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈసారి మొత్తం 954 మంది సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. police medals for gallantryకి 229 మంది, 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీస్ విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది. పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 55, మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్ నుంచి 27, ఛత్తీస్గఢ్ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం సీఆర్పీఎఫ్ అధికారి లౌక్రక్పామ్ ఇబోంచా సింగ్ ను వరించింది.
తెలంగాణ నుంచి 34, ఆంధ్రప్రదేశ్ నుంచి 29
తెలంగాణ నుంచి 34, ఆంధ్రప్రదేశ్ నుంచి 29 మందికి ఈ విశిష్ట పతకాలు దక్కాయి. తెలంగాణలో 22 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ , ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పోలీసు పతకం, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 18 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ , ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పోలీసు పతకం, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు ప్రకటించారు. తెలంగాణ నుంచి అదనపు డీజీ విజయ్ కుమార్, ఎస్పీ మాదాడి రమణ కుమార్.. ఆంధ్రప్రదేశ్ నుంచి అదనపు డీజీ శంకబ్రత బాగ్చి రాష్ట్రపతి పోలీసు విశిష్ఠ సేవా పతకం అందుకోనున్నారు.