DGFT: ఫోర్స్డ్ లేబర్ ద్వారా తయారైన ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రతిపాదించిన అదనపు టారిఫ్ల వివాదం కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు శ్రమ (ఫోర్స్డ్ లేబర్)తో పూర్తిగా లేదా కొంతవరకు తయారైన వస్తువుల దిగుమతులను నిషేధిస్తూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు విదేశీ వాణిజ్య విధానం(Foreign Trade Policy-FTP)లో కొత్త నిబంధనను చేర్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)జూలై 13న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం అమెరికా ఇటీవల భారత్పై చేపట్టిన సెక్షన్ 301 దర్యాప్తు, 12.5 శాతం అదనపు టారిఫ్ల ప్రతిపాదన నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను సమర్థంగా అడ్డుకోవడంలో లోపాలున్నాయని అమెరికా ఆరోపిస్తూ దర్యాప్తు చేపట్టింది.
వివరాలు
అధికారిక గెజిట్లో ప్రచురించిన 30 రోజుల తర్వాత అమల్లోకి..
ఆ దర్యాప్తు అనంతరం జూన్ 3న కొత్త టారిఫ్లను కూడా విధించింది.
కొత్త నిబంధనల ప్రకారం బలవంతపు శ్రమతో తయారైన వస్తువులను దిగుమతి చేసుకోవడం పూర్తిగా నిషేధం.
ఏ వస్తువులను ఈ నిషేధ పరిధిలోకి తీసుకురావాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అవసరాన్ని బట్టి అధికారిక గెజిట్ ద్వారా ప్రకటించనుంది.
అలాగే డీజీఎఫ్టీ చేపట్టే విచారణ విధానం కూడా ప్రత్యేకంగా రూపొందించనుంది.
ఈ నోటిఫికేషన్ అధికారిక గెజిట్లో ప్రచురించిన 30 రోజుల తర్వాత అమల్లోకి రానుంది.
ఈ నిర్ణయంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి మాట్లాడుతూ, ఇప్పటికే చట్టాల్లో ఇటువంటి చర్యలు తీసుకునే అధికారాలు ఉన్నప్పటికీ, తాజా నోటిఫికేషన్తో వాటిని స్పష్టంగా పేర్కొన్నామని తెలిపారు.
వివరాలు
అమెరికా ప్రతిపాదించిన 12.5శాతం టారిఫ్లను పునఃసమీక్షించాలని కోరుతున్న భారత్
ముఖ్యంగా "సుమోటో"(Suo Motu)అధికారాన్ని స్పష్టంగా చేర్చడంతో, ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా అధికారులు స్వయంగా విచారణ ప్రారంభించే అవకాశం కల్పించినట్లు చెప్పారు.
ఈ మార్పు అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా,అమెరికా ప్రతిపాదించిన 12.5శాతం టారిఫ్లను పునఃసమీక్షించాలని భారత్ కోరుతోంది.
సెక్షన్ 301 దర్యాప్తు తుది నివేదికలో ఉన్న అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని వాణిజ్యశాఖ వాదిస్తోంది.
ఇటీవల జరిగిన ప్రజా విచారణలో వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శి బ్రిజ్ మోహన్ మిశ్రా మాట్లాడుతూ,బలవంతపు శ్రమ నిర్మూలన భారత రాజ్యాంగబద్ధ బాధ్యత మాత్రమే కాకుండా అంతర్జాతీయ చట్టాలు,ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న సూత్రాల ప్రకారం కూడా దేశం పాటించాల్సిన బాధ్యత అని స్పష్టం చేశారు.
వివరాలు
వ్యక్తి ఇష్టానికి విరుద్ధంగా చేయించే ఏ పని లేదా సేవనైనా బలవంతపు శ్రమగా పరిగణిస్తారు
అంతర్జాతీయ కార్మిక సంస్థ(ILO)ప్రమాణాల ప్రకారం,శిక్ష భయంతో వ్యక్తి ఇష్టానికి విరుద్ధంగా చేయించే ఏ పని లేదా సేవనైనా బలవంతపు శ్రమగా పరిగణిస్తారు.
గ్రాంట్ థార్న్టన్ భారత్కు చెందిన పన్ను వివాదాల నిపుణుడు మనోజ్ మిశ్రా మాట్లాడుతూ,ఈ నిర్ణయం భారత విదేశీ వాణిజ్య విధానంలో కీలక మార్పుగా అభివర్ణించారు.
ఐఎల్ఓ ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్కు అనుగుణంగా ప్రత్యేక వాణిజ్య నిబంధనను చేర్చడం ద్వారా భారత్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తన నియంత్రణవ్యవస్థను మరింత బలోపేతం చేసిందని తెలిపారు.
అయితే ఈ నిర్ణయం అమలులో ఎంత మేర ప్రభావం చూపుతుందనేది డీజీఎఫ్టీ రూపొందించనున్న విచారణ విధానం,అమలు మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
దిగుమతిదారులు పాటించాల్సిన నిబంధనల పరిధి కూడా వాటి ద్వారానే స్పష్టమవుతుందని చెప్పారు.