Chinese Envoy: భారత్, చైనా అభివృద్ధి వెనుక కఠోర శ్రమే కారణం: షు ఫీహాంగ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ అభివృద్ధిని ప్రశంసిస్తూ చైనా రాయబారి షు ఫీహాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్, చైనా దేశాలు సాధించిన అభివృద్ధి వెనుక ప్రధాన కారణం కఠోర శ్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎదుగుదల విదేశీ దేశాల సహాయం వల్ల కాదని కూడా ఆయన పేర్కొన్నారు. అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే షు ఫీహాంగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. చైనా విషయంలో గతంలో తాము చేసిన తప్పును భారత్ విషయంలో పునరావృతం చేయమని లాండౌ చేసిన వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ఖండించినట్లుగా భావిస్తున్నారు.
వివరాలు
ద్వైపాక్షిక సంబంధాలపై పిలుపు
భారత్-చైనా యువజన చర్చల కార్యక్రమంలో పాల్గొన్న షు ఫీహాంగ్, ఇరుదేశాల అభివృద్ధిపై మాట్లాడారు. ఇటీవల కాలంలో భారత్, చైనా అద్భుతమైన ప్రగతి సాధించాయని, ఈ విజయాలు పూర్తిగా ఇరుదేశాల ప్రజల కష్టానికి ఫలితమని తెలిపారు. ఇందులో ఇతర దేశాల పాత్ర ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్, చైనా దేశాలు పొరుగు దేశాలుగా స్నేహపూర్వకంగా కొనసాగాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడటం కొందరికి ఇష్టం లేదని, ఉద్దేశపూర్వకంగా విభేదాలను పెంచి లాభపడాలని చూస్తున్నారని అన్నారు. అయితే, ఆ దేశాలు ఎవరో మాత్రం ఆయన వెల్లడించలేదు.
వివరాలు
మోదీ-షీ చర్చల ప్రభావం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలను కూడా షు ఫీహాంగ్ ప్రస్తావించారు. ఈ సమావేశాల తర్వాతే ఇరుదేశాల సంబంధాలు మళ్లీ పునరుద్ధరించబడినట్లు ఆయన తెలిపారు. గ్లోబల్ సౌత్లో ముఖ్య భాగస్వాములుగా భారత్, చైనా దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులు, ప్రయోజనాలను కలిసి కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.